ప్రజాశక్తి-చీపురుపల్లి : గరివిడి మండలం డమ్మెద గ్రామం వద్ద స్థానిక ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు శుక్రవారం తోటపల్లి కాలువ పనులను ప్రారంభించారు. అనంతరం చీపురుపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో పాల్గొని వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ ప్రపంచ స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతికి అగ్రస్థానం కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అమరావతి అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. జరుగుతున్న అభివృద్ధికి అడ్డుపడకుండా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. అనంతరం ప్రజల నుంచి తాగునీటి సమస్యలు, రెవెన్యూ సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ అందించిన అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ అధికారులు ఎక్కడా అలసత్వం వహించకుండా తక్షణమే సమస్యల పరిష్కార దిశగా పనిచేయాలని సూచించారు. ప్రజా దర్బార్లో వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రౌతు కామనాయుడు, గరివిడి మండల నాయకులు పైల బలరాం, ఆలయ కమిటీ చైర్మన్ గవిడి నాగరాజు పాల్గొన్నారు.
