ప్రజాశక్తి-బొబ్బిలి : రోడ్లపై చెత్త వేసే వారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి చెప్పారు. పట్టణంలో శ్వేతచలపతి స్కూల్ రోడ్డు, మెయిన్ రోడ్డు, మార్కెట్, మహారాణిపేట, గొల్లవీధి ప్రాంతాల్లో గురువారం కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయొద్దని హెచ్చరిస్తున్నా కొంతమంది వేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి నోటీసులు జారీ చేసి జరిమానా వేయాలని అధికారులకు సూచించారు. గొల్లవీధి మెయిన్ రోడ్డులో ఖాళీ ప్రాంతంలో ఉన్న చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని ఆదేశించారు. చిన్న చెరువు గట్టు వీధిలో కాలువల్లో పూడికలను గుర్తించి, తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు.