ఆదివాసీల్లో ఆగ్రహం

May 10,2025 20:57

ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : ఓ వైపు డిఎస్‌సి సమయం దగ్గరపడుతోంది. మరోవైపు గిరిజనులకు మెగా డిఎస్‌సిపై ప్రభుత్వం నోరు మొదపడం లేదు. దీంతో, గిరిజన ఆదివాసీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వం మాత్రం తనకు పట్టనట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇటీవల పలు దఫాలు స్పందించిన విషయం విధితమే. తొలుత అమాయక గిరిజనులు వైసిపి మాటలు నమ్మి మోసపోవద్దంటూ ప్రకటన చేశారు. వాస్తవానికి గిరిజనులు వైసిపిని కూడా నమ్మలేదు. ఎందుకంటే వైసిపి కూడా ఇటువంటి హామీ ఇచ్చి మోసం చేసింది. బహుశా అందుకేనేమో వైసిపి ఆవిర్భావం నుంచి మంచి పట్టున పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల్లో ఆ పార్టీని మట్టికరిపించింది. అందులో భాగంగానే సాలూరు వాసులు సంధ్యారాణికి పట్టం కట్టారు. ఆమెకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి కూడా వరించింది. అందువల్లే వైసిపిని నమ్మొద్దని గిరిజనులకు చెప్పడం వారిని దూరం చేసుకోవడం లేదా తప్పుదారి పట్టించడమేనని పబ్లిక్‌ టాక్‌ వినిపిస్తోంది. ఆ తరువాత కొద్ది రోజులకే ఆందోళనలు ఆపితే సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి గిరిజన మెగా డిఎస్సీ విషయమై త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే విధంగా కృషిచేస్తానని చెప్పారు. తీరా నిన్నకాక మొన్న జరిగిన సమావేశంలో అటువంటి చర్చయేమీ వినిపించలేదు. మంత్రి అందుకు తగ్గట్టు ప్రయత్నం చేశారా? లేక ఆమె ప్రయత్నాన్ని సిఎం చంద్రబాబు తోసిపుచ్చారా? అన్నది మంత్రికే ఎరుక. గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శితో గిరిజనసంఘం నాయకులు సమావేశమైనా స్పెషల్‌ డిఎస్‌సి నిర్వహణపై ఎటువంటి సానుకూలతా రాలేదు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్‌సిలో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది. నోటిఫికేషన్‌లోని 16,347 పోస్టుల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని షెడ్యూల్డ్‌ ప్రాంత గిరిజనులకు కేవలం 45 పోస్టులే దక్కనున్నాయి. కానీ, 2వేల పోస్టుల వరకు గిరిజనులకు ఉన్నాయని మంత్రిగారు చెబుతున్నారు. ఇది మోసపూరిత ప్రకటన అని ఆదివాసీ గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మంత్రి చెప్పింది వాస్తవమైతే ఆ రెండువేల పోస్టులు ఎక్కడెక్కడ గిరిజనులకు రిజర్వుచేయబడ్డాయో స్పష్టంగా చెప్పాలంటూ గిరిజనుల చేస్తున్న డిమాండ్‌కు మంత్రి నుంచి స్పందన రావడం లేదు. ఆదివాసీ ప్రత్యేక డిఎస్‌సి నిర్వహిస్తామని చెప్పిన గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఆ మాటను నిలబెట్టుకోకపోవడంతో ఆదివాసీ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉద్యోగాల విషయంలో తమకు జరుగుతున్న అన్యాయంపై రగిలి పోతున్నారు. ఏజెన్సీలో నూరు శాతం ఉద్యోగాలను ఆదివాసీలకే కల్పించే జిఒ 3 రద్దుపై పాలకపార్టీల తీరుపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న ఆదివాసీ యువత ఈ రెండు జిల్లాల్లో భారీగా ఉంది. బిఇడి, డైట్‌, వ్యాయామ ఉపాధ్యాయ శిక్షణ పొంది సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం వయసు సడలింపు ఇవ్వడంతో తాజా డిఎస్‌సికి మరింత పోటీ పెరిగింది. మన్యం, అల్లూరి జిల్లాల్లో 889 పోస్టులు ఉంటే గిరిజనులకు తాజా నోటిఫికేషన్‌లో కేవలం 45 పోస్టులే దక్కనున్నాయి. దీంతో, తమ ప్రాంతంలో తమకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కకుండా పోతుండడంతో గిరిజన యువతలో అసహనం పెరుగుతోంది. ప్రత్యేక డిఎస్‌ సితోనే న్యాయంఏజెన్సీలో గిరిజన ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించి స్థానిక గిరిజన నిరుద్యోగ యువతతో ఆ పోస్టులను భర్తీ చేస్తేనే వారికి న్యాయం జరుగుతుంది. సాధారణంగా నిర్వహించే డిఎస్‌సి ద్వారా గిరిజన అభ్యర్థులకు ప్రయోజనం బహు స్వల్పం. 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక డిఎస్‌సి ద్వారా 640 పోస్టులను భర్తీ చేస్తామని జిఒ 233 జారీ చేసింది. కానీ, అది అమలుకాలేదు. గిరిజన సంఘాలు, గిరిజన నిరుద్యోగులు ఆందోళనలు చేసి నా ఫలితం లేకపోయింది. 2015లో అప్పటి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోరబాబు గిరిజన అభ్యర్థుల కోసం ప్రత్యేక డిఎస్‌సి నిర్వహిస్తా మని ప్రకటించారు. మూడేళ్లపాటు నోటిఫికేషన్‌ వెలువడలేదు. 2019 ఫిబ్రవరిలో 611 పోస్టుల భర్తీకి టిడిపి ప్రభుత్వం జిఒ 10ని జారీ చేసింది. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ప్రత్యేక డిఎస్‌సి నోటిఫికేషన్‌ వెలువడలేదు. ఆదివాసీ ప్రాంతంపై ప్రభుత్వాల ఉదాసీనతకు తోడు అధికారుల అలసత్వంతో ఆదివాసీ ప్రాంతంలో విద్య, సంక్షేమం, ఉద్యోగ నియామకాలు, ఉద్యోగోన్నతులు లొసుగులమయంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపనకు, మంత్రి సంధ్యారాణి గిరిజన జాతికి ఇచ్చే హామీ నిలబెట్టుకునేందుకు గిరిజన యువత చేస్తున్న పోరాటం బలపరీక్షగా మారిందని పబ్లిక్‌ టాక్‌.

➡️