ప్రజాశక్తి – నెల్లిమర్ల : సామాజిక ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమై సంవత్సరాల గడుస్తున్నా ఇంతవరకు పూర్తికాలేదు. 6 సంవత్సరాల క్రితం సామాజిక ఆసుపత్రి అదనపు గదుల నిర్మాణం ప్రారంభమైంది. సంవత్సరాలు గడుస్తున్నా ఆసుపత్రి ఇంతవరకు పూర్తి కాలేదు. అప్పట్లో ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించి నిర్మాణ పనులు కాంట్రాక్టరుకు అప్పగించింది. నిధులు విడుదల కాక మధ్యలో కొంతకాలం పనులు నిలిచిపోయాయి. మళ్లీ పనులను ప్రారంభించినా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా అదే పరిస్థితిగత ప్రభుత్వంలో సామాజిక ఆసుపత్రి నిర్మాణంలో నిర్లక్ష్యం వహించగా ప్రస్తుతం ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యం చూపించి ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు కేటాయించకపోవడం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. నిర్మాణం పూర్తికాకాక పోవడంతో వైద్య సిబ్బంది, రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. ముఖ్యంగా వైద్యం కోసం వస్తున్న రోగులు ఇరుకు గదుల్లో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.పెరుగుతున్న ఒపినెల్లిమర్ల సామాజిక ఆస్పత్రికి రోగులు సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రతి రోజూ కనీసం 200 నుంచి 300 మంది వరకూ రోగులు వస్తుంటారు. వీరికి గదులు చాలకపోవడంతో ఆసుపత్రి వరండాలో రోగులు నమోదు (ఒపి), తనిఖీలు చేస్తున్నారు. గదుల సౌకర్యం చాలక పోవడంతో బయట చికిత్స పొందుతున్నారు. వైద్యలు కూడా ఇరుకు గదుల్లో సేవలు అందిస్తు న్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు డెంగీ, మలేరియా వంటి వైరల్ జ్వరాలతో రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గదులు సౌకర్యం చాలక వైద్యలు, సిబ్బంది, రోగులు గత 6 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది, మందులు ఉన్నప్పటికీ గదులు కొరత వల్ల వైద్య సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడుతున్నారు.మూలకు చేరిన సామగ్రిఆస్పత్రి భవనం పూర్తి కాకముందే ఆస్పత్రికి కావాల్సిన బెడ్లు, మంచాలు, చిన్న పిల్లల చికిత్స కోసం పరికరాలను ప్రభుత్వం మంజూరు చేసి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే వాటిని వినియోగించడానికి గదులు లేక అలాగే వదిలేశారు. దీంతో అవి వినియోగించకముందే మూలకు చేరాయి. ఎక్షరే ప్లాంట్ ఉన్నా గది సౌకర్యం లేక వినియోగంలోకి రాలేదు. ఇప్పటికైనా సామాజిక ఆసుపత్రి అదనపు గదుల నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.
