త్వరితగతిన పరిశ్రమలకు అనుమతులు

May 5,2025 21:33

ప్రజాశక్తి-విజయనగరం : పరిశ్రమల స్థాపన కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించి, నిర్ణీత కాలవ్యవధిలోగా అనుమతులను మంజూరు చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఎస్‌.సేతు మాధవన్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. జిల్లాలో పరిశ్రమలకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్‌ విండో ద్వారా గడువు లోపల అనుమతులను మంజూరు చేసి, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని సూచించారు. గత మూడు నెలల్లో పరిశ్రమల స్థాపనకు 149 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఇప్పటివరకు 138 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. వీలైనంత వేగంగా మిగిలిన వాటిని అనుమతించాలని చెప్పారు. వీలైనంత వేగంగా రుణాలను మంజూరు చేయాలని బ్యాంకులకు సూచించారు. చేతివృత్తిదారులకు చేయూత ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తోందని, వీలైనంత వేగంగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. బొబ్బిలి వీణల తయారీ లాంటి అరుదైన కళలకు ప్రోత్సాహం అందించేందుకు కృషి చేయాలని సూచించారు. పిఎం విశ్వకర్మ యోజనకు సుమారు 86,386 దరఖాస్తులు అందగా, మూడు దశల్లో వీటిని పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. వీటిలో ఇప్పటివరకు 1,080 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేయడం పట్ల ఇన్‌ఛార్జి కలెక్టర్‌ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఇ సర్వేను పునఃసమీక్షించాలని సూచించారు. పరిశ్రమల స్థాపన కోసం స్థలం దాదాపు 15 ఏళ్ల క్రితం స్థలం తీసుకొని, పరిశ్రమను స్థాపించకుండా మళ్లీ గడువు కోరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని, పరిశ్రమ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ శ్రీధర్‌, సహాయ సంచాలకులు బి.రామకృష్ణ, ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ మురళీ మోహన్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️