విజయనగరం: విద్యార్థులు తమ దృష్టంతా చదువుపై కేంద్రీకరించి భవిష్యత్తులోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణులై తమ తల్లిదండ్రులకు, జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆకాంక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది పదో తరగతిలో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించిన పలువురు విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను కలెక్టర్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సత్కరించారు. ఇంటర్ తదితరపై తరగతుల్లోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, తమను ఎంతో కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకు రుణపడి ఉండాలన్నారు. పలువురు బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ బలంగా ఆరోగ్యంగా వున్నపుడే లక్ష్యాలను సాధించగలుగుతారని చెప్పారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని విద్యార్ధుల తల్లిదండ్రులకు సూచించారు. తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి వారు ఏయే వృత్తుల్లో వున్నదీ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో కలెక్టర్ మాట్లాడి వారి భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. జిల్లా టాపర్గా నిలిచిన గర్భాం జెడ్పి హైస్కూల్ విద్యార్ధి సంగరెడ్డి వివేక్ తాను కంప్యూటర్ ఇంజనీర్ అవుతానని తెలిపాడు. ఒక విద్యార్ధి తాను సివిల్స్ సాధించాలని భావిస్తున్నట్టు చెప్పగా, పలువురు తాము ఇంజినీరింగ్లో చేరుతామని వివరించారు. విద్యార్ధులకు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం రచించిన ఒక విజేత ఆత్మకథ, డాక్టర్ బి.వి.పట్టాభిరాం రచించిన కష్టపడి చదవొద్దు – ఇష్టపడి చదవండి పుస్తకాలను బహూకరించారు. విద్యార్ధులు సంగారెడ్డి వివేక్(జెడ్పి హైస్కూల్, గర్భాం), కొయ్య హరీష్( ఎ.పి.మోడల్ స్కూల్, భోగాపురం), లావేటి మెహర్ రేష్మ(బి.సి.సంక్షేమ గురుకులం), చోడవరపు శివ (బి.సి.సంక్షేమ గురుకులం, కారాడ), పెదిరెడ్ల భాగ్యశ్రీ(జెడ్పీ హైసస్కూల్, కొట్యాడ), శంబంగి కలవల లక్ష్మి (జెడ్పి హైస్కూల్, పక్కి), తాడేల రేవంత్(జెడ్పి హైస్కూల్, భైరిపురం), సెనేటి మోహన్(బి.సి.సంక్షేమ గురుకులం, కారాడ), పైల యశోద( జెడ్పి హైస్కూల్, జిన్నాం)లను సత్కరించారు. కె.జి.బి.వి.పాఠశాలల్లో 580కి పైగా మార్కులు సాధించిన విద్యార్ధులను కలెక్టర్ సత్కరించారు. శతశాతం పైగా ఉత్తీర్ణత సాధించిన జామి, వంగర, గజపతినగరం, ఎల్.కోట కెజిబివి పాఠశాలల ప్రిన్సిపాల్లను అభినందించారు. కార్యక్రమంలో డిఇఒ యు.మాణిక్యంనాయుడు, సమగ్రశిక్ష ఎపిసి డాక్టర్ ఎ.రామారావు, పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు.
