మేయర్ విజయలక్ష్మి
నగర పాలక సంస్థ అధికారులు నివాళి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విప్లవ జ్యోతిగా, పోరాట యోధునిగా, మన్యం వీరునిగా అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని నగర మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ కార్యాలయంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. సహాయ కమిషనర్ సిహెచ్ కె.అప్పలరాజు, మున్సిపల్ అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింగరాజు, ఇతర సిబ్బంది అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు చూపిన పోరాటపటిమ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. గిరిజనుల అణచివేతను వ్యతిరేకించిన అల్లూరి సీతారామరాజు ఉద్యమ బాట పట్టి బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించారని అన్నారు. విప్లవ జ్వాలను రగిలించిన మహాయోధుడు అని కొనియాడారు. కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ అతి పిన్న వయసులోనే ప్రపంచ ఖ్యాతిని గడించిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజని కొనియాడారు. ఆయన పోరాటం ధైర్య సాహసాలకు నిదర్శనమని అన్నారు. బ్రిటిష్ తూటాలకు ఎదురొడ్డి ప్రాణాలను సైతం త్యజించిన గొప్ప త్యాగశీలని శ్లాఘించారు. ఆయన స్ఫూర్తితో అంకితభావంతో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మేనేజర్ ప్రసాదరావు,టి పి ఆర్ ఓ సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
