టిడిపిలో ఉత్కంఠకు తెర

Apr 28,2025 20:59

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : నామినేటెడ్‌ పదవుల కేటాయింపు విషయంలో టిడిపిలో నెలకున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, రాష్ట్ర కార్యదర్శి గొంప క్రిష్ణ నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురు చూసిన సంగతి తెలిసిందే. వీరితోపాటు పార్టీ శ్రేణులు, ముఖ్యంగా వారి అనుయాయులు కూడా అసక్తిగా నిరీక్షించారు. ఎట్టకేలకు డిసిసిబి అధ్యక్షులుగా నాగార్జునను, డిఎంఎస్‌ చైర్మన్‌గా గొంపను నామినేట్‌ చేస్తూ సోమవారం టిడిపి అధిష్టానం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఇద్దరిలో ఆయా పదవులు ఒకింత ఉత్సాహం, మరింత నిరుత్సాహం నింపాయని పార్టీ శ్రేణులనుంచి వినిపిస్తున్నాయి. కనీసం ఎమ్మెల్సీలు అవుతారని అంతా భావించామని, తీరా ఆ పదవులు ఇవ్వకపోయేసరికి, రాష్ట్ర స్థాయి చైర్మన్‌ పోస్టులైనా ఇస్తారనుకుంటే తీరా అత్యంత ఒడిదొడుకుల్లో నడుస్తున్న డిసిసిబి, డిసిఎంఎస్‌ పదవులతో సరిపెట్టేశారని చర్చిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి చీపురుపల్లి నుంచి నాగార్జున, ఎస్‌.కోట నుంచి గొంప, నెల్లిమర్ల నుంచి కర్రోతు బంగార్రాజు భంగపడిన సంగతి తెలిసిందే. వీరిలో బంగార్రాజుకు మార్కెఫెడ్‌ చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. అయితే ఆయనకు కూడా ఆ పదవి అంతగా రుచించలేదు. ఈ సంగతి కాస్త పక్కనబెడితే… ముఖ్యంగా నాగార్జున ఎన్నికలకు ముందు నుంచీ జిల్లా పార్టీ బాధ్యతలు చూస్తూనే చీపురుపల్లిలో చురుకైన పాత్ర పోషించారు. నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శక్తిమేర పనిచేయడంతో గత ఎన్నికల్లో సీటు ఆయనకు ఖాయం అనే వాతావరణం కూడా అప్పట్లో కనిపించింది. చివరకు చీపురుపల్లి ఎమ్మెల్యే కళావెంకటరావు కోసం నాగార్జునను పక్కనబెట్టారు. అప్పట్లో తీవ్ర నిరాశ, మనస్థాపం చెందిన ‘నాగార్జున యువత రాజకీయాల్లోకి రావొద్దు’ అంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. ఆయనకు సీటు ఇవ్వాలంటూ చీపురుపల్లిలో భారీ ర్యాలీలు కూడా జరిగాయి. చివరకు పార్టీ నేత లోకేష్‌ జోక్యంతో నాగార్జున ఒక్క అడుగు వెనక్కితగ్గి పార్టీ అధ్యక్షునిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు ఎస్‌.కోట టిక్కెట్‌ ఆశించిన గొంప కృష్ణ సీటు దక్కకపోవడంతో ఏకంగా స్వతంత్రంగా పోటీచేసేందుకు కూడా సిద్ధం అయ్యారు. ఇందుకనుగుణంగా భారీ బహిరంగ సభసైతం నిర్వహించడంతో అధిష్టానం రంగంలోకి దిగి బుజ్జగించింది. అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామంటూ అధినేత చంద్రబాబు సహా లోకేష్‌ కూడా హామీ ఇచ్చారు. దీంతో, వెనక్కి తగ్గడంమే కాకుండా విశాఖ ఎంపీ భరత్‌తో ఉన్న సన్నిహిత సంబంధాలను బట్టి పార్టీ గెలుపునకు కృషి చేశారనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో వీరికి ఎమ్మెల్సీ పదవులు వస్తాయని తొలుత పార్టీ కేడర్‌ భావించింది. ఆ పదవులు వీరి వరకు రావని తేలడంతో కనీసం రాష్ట్ర స్థాయి నామినేటెడ్‌ పదవులు వస్తాయని నాగార్జున, గొంపతోపాటు వారి అనుయాయులు కూడా ఆశించారు. తీరా, జిల్లా స్థాయిలో అదీ ప్రభుత్వమే పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని డిసిసిబి, డిసిఎంస్‌ చైర్మన్‌ పోస్టులతో సరిపెట్టడంతో ముఖ్యంగా నాగార్జున, గొంప పరిస్థితి కక్కలేక మింగలేక అన్న చందాన ఉంది. వాస్తవానికి గతంలో వైసిపి, టిడిపి ప్రభుత్వాలే కో-ఆపరేటివ్‌ సొసైటీలను నిర్వీర్యం చేశాయి. కో-ఆపరేటివ్‌ సెక్టార్‌లోవున్న భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీ మూత ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ పూర్వపరాల్లో డిసిసిబి ఇప్పటికే తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. పాలకపార్టీలకు చెందిన నాయకులు రూ.కోట్ల రుణాలు తీసుకుని, వాటిని తీర్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇలాంటి మొండి బకాయిలను వసూలు చేసి, ఆ బ్యాంకును ప్రగతిపథంలో నడిపించ డమంటే మాటలు కాదు. కొన్ని శాఖలు దివాలా తీసే పరిస్థితి వరకు వచ్చిందంటే ఆదిలోనే హంసపాదులా ప్రారంభంలోనే అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తుందన డంలో సందేహం లేదు. డిసిఎంఎస్‌ కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మొత్తం మార్కెటింగ్‌ వ్యవస్థనే బడా వ్యాపారులకు అనుగుణంగా మార్చేసిన తరుణంలో డిసిఎంఎస్‌ల మనుగడే కష్టతరంగా మారింది. రైతు సేవా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాక ధాన్యం కొనుగోలు, యూరియా, డిఎపి వంటి ఎరువుల విక్రయాలకు కూడా దూరమైంది. ప్రస్తుతం ఐసిడిఎస్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ స్కూళ్లకు ఆహార పొట్లాలను మార్కెటింగ్‌ చేస్తూ నెట్టుకొస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో డిసిసిబి అధ్యక్షపదవిగానీ, డిసిఎంఎస్‌ చైర్మన్‌ పదవిగానీ వారి పార్టీ పదవులకన్నా పెద్దవేమీ కాదనే చర్చ పార్టీ శ్రేణుల్లోను, వారి అనుయాయుల్లోనూ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నాగార్జున, గొంప అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

➡️