ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శేషగిరి స్ఫూర్తితో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు ఎన్ఇపికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి, కీర్తిశేషులు కోరెడ్ల శేషగిరి 4వ వర్థంతి సభ స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం జరిగింది. తొలుత శేషగిరి చిత్రపటం వద్ద ఆయన కుటుంబ సభ్యులతో పాటు హాజరైన నాయకులంతా నివాళులర్పించారు. అనంతరం శేషగిరి రాసిన వ్యాసాల సంపుటి ‘తరుగులేని కీర్తి సిరి’ పుస్తకాన్ని జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పిడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్రావు, నాయకులు కె.విజయగౌరి, డి.రాము తదితరులు ఆవిష్కరించారు. అనంతరం ‘భారత ఫెడరలిజం – సవాళ్లు’ అనే అంశంపై లక్ష్మణరావు స్మారక ఉపన్యాసం చేశారు. తొలుత జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ స్పూర్తిని కలిగిన వ్యక్తి శేషగిరి అని అన్నారు. శేషగిరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారానే సరైన నివాళి అన్నారు. శేషగిరి విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం శేషగిరి సోదరి, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి ‘తరుగులేని కీర్తి సిరి’ పుస్తక పరిచయం చేశారు. విద్యారంగంలో వస్తున్న మార్పులు, ఎన్ఇపి వల్ల రానున్న కాలంలో విద్యా వ్యవస్థ వ్యాపార సరుకుగా ఎలా మారుతుంది, మతతత్వ భావజాలం విద్యా వ్యవస్థలో ఎలా చేరుతుంది, రాబోయే కాలంలో దారితీసే పరిణామాలను వ్యాసాలు ద్వారా ముందుగానే శేషగిరి అంచనా వేసి రాశారని వివరించారు. క్లస్టర్ పాఠశాల విధానం, డిజిటల్ విద్యా విధానం వలన జరిగే నష్టాలను శేషగిరి గతంలోనే వివరించారన్నారు. నేడు ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యంగా మారి ందని, అందుకోసం సన్నద్ధం కావాలని తెలిపారు. అనంతరం మాజీ పిడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ‘భారతదేశ ఫెడరలిజం-సవాళు’్ల అనే అంశంపై స్మారకోపాన్యాసం చేశారు. భారత దేశంలో నేడు రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన హక్కులపై దాడి జరుగుతుందన్నారు. సమాఖ్య స్పూర్తి కలిగిన రాజ్యాంగాన్ని నేడు నిర్వీర్యం చేసే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారన్నారు. అందులో భాగంగా జిఎస్టి తీసుకొచి రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం రాకుండా కేంద్ర ప్రభుత్వం లాగేసుకోవడం ఫెడరిలిజానికి విరుద్ధమన్నారు. విద్య అనేది రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలోని అంశమని, అటువంటి విద్యను ఎన్ఇపి 2020 ను తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తిగా ప్రైవేటు చేతుల్లో పెడుతున్నారని వివరించారు. క్రమంగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్నార న్నారు. ఆయా రాష్ట్రాలు వారికి అనుగుణంగా ఎటువంటి విద్యా విధానం ఉండాలో రూపొందిం చుకునే హక్కును కాలరాయడం ఫెడరిలిజానికి విరుద్ధమన్నారు. రాష్ట్ర జాబితాలో ఉన్న వ్యవసాయ రంగంలో కూడా మూడు నల్లచట్టాలను తీసుకొచ్చి రైతుల భూములు కార్పొరేట్ దోపిడీదార్లకు కట్టబెట్టే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసిందన్నారు. ఇది సమాఖ్య స్పూర్తి కి విరుద్ధమన్నారు. దీనిపై రైతులు 450 రోజులు పాటు పోరాడి నల్ల చట్టాలను తిప్పికొట్టారన్నారు. జమిలీ ఎన్నికలు అని చెప్పి ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కలిగిన మన దేశంలో సమాఖ్య స్పూర్తి కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నార న్నారు. ఫెడలిరిజం, లౌకిక తత్వం బలహీన పడితే దేశ ప్రజలు ప్రమాదంలో ఉన్నట్లేనన్నారు. నేడు రాష్ట్రాల హక్కులను ,రాజ్యాంగాన్ని కాపాడకోవడమే మనదేశ సమైక్యత అని, అందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. శేషగిరి నిరంతరం అధ్యయనం చేయడం, వాటిని రాయడం అనేవి అందరికీ స్పూర్తి అన్నారు. శేషగిరిని ఆదర్శంగా తీసుకోవడమంటే ఆయన రాసిన వ్యాసాలను అధ్యయనం చేయడం, దానిని ఆచరణలో పెట్టడం కర్తవ్యంగా తీసుకోవాలన్నారు.యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ యుటిఎఫ్ రూపొందించుకున్న మూడు కర్తవ్యాలను అధ్యయనం, అధ్యాపనం, ఆచరణ అనే మూడు కర్తవ్యాలను అమలు చేసి ఉపాధ్యాయులందరికీ ఆదర్శప్రాయ నాయకుడు అయ్యారని అన్నారు. మనలో ఉద్యమ స్పూర్తిని నింపిన వ్యక్తి అని కొనియాడారు. ఆయన మనకిచ్చిన ఉద్యమ స్పూర్తిని ముందుకు తీసుకెళ్లడం మన కర్తవ్యమన్నారు. అనంతరం సిపిఎం సీనియర్ నాయకులు ఎం.కృష్ణమూర్తి మాట్లాడుతూ శేషగిరి అంటే ఒక ఉద్యమమని, వర్గ దృష్టితో ఆలోచించేవారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు సమస్యలపై వర్గ దృష్టితో ఆలోచించి ఐక్య ఉద్యమాలను నిర్మించారని అన్నారు. ఆయన అందించిన స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్కె ఈశ్వరరావు, ప్యాఫ్టో జిల్లా చైర్మన్ శ్రీనివాసరావు, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు డి.రాము, పండిత్ పరిషత్ నాయకులు ఎ.శ్రీనివాసరావు, ఎపి ఎన్జీవో సంఘం కార్యదర్శి సురేష్, పూర్వ నాయకులు వి.రాజగోపాల్, యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహన్, సిఐటియు నాయకులు తమ్మినేని సూర్యనారాయణ, సాహితీ స్రవంతి కన్వీనర్ చీకటి దివాకర్, ఎపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి పైడిరాజు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనసూయ, కవి చలం శేషగిరిలో ఉన్న పోరాట పటిమ, ఉద్యమ స్పూర్తిని వివరించారు. సభలో శేషగిరి అన్నయ్య తిరుపతిరావు శేషగిరి విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి మరో మూడు లక్షలు ప్రకటించారు. సభలో శేషగిరి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, ప్రజా సంఘాలు నాయకులు పాల్గొన్నారు.
