ప్రజాశక్తి – బొబ్బిలి : మద్యాన్ని నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందించి మద్యాన్ని నియంత్రిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో అమలు చేయడం లేదన్నారు. నాసిరకం మద్యాన్ని అమ్మడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడి ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైన్ షాపులను పెంచి ప్రధాన రహదారులు పక్కన పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రజలు మృత్యువాత పడుతున్నారన్నారు. మద్యం షాపులు ప్రైవేట్ వ్యాపారులకు ఇవ్వడం వల్ల సిండికేట్గా మారి మద్యం ధరలు పెంచి గ్రామాల్లో బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారని విమర్శించారు. మద్యాన్ని నియంత్రించాలని, నాణ్యమైన మద్యం సరఫరా చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో సిపిఎం చేసిన ప్రజా చైతన్య యాత్రలో బెల్ట్ షాపులు, నాసిరకం మద్యం, మద్యం ధరలపై ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. బెల్ట్ షాపులను పూర్తిగా నియంత్రించకపోతే ఎక్సైజ్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు యుగంధర్, శంకర్, గోపాల్ పాల్గొన్నారు.
