ప్రజాశక్తి- డెంకాడ : మూడు జిల్లాల రహదారులు కనిపించేటట్టు నేషనల్ హైవేలపై సోలార్ కెమెరాలను పోలీసులు శనివారం ఏర్పాటు చేశారు. డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం మూడు జిల్లాల జాతీయ రహదారులు ఉండడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో గత నెలలో జిల్లా ఎస్పి వకీల్ జిందాల్ మండల పరిధిలో ఉన్న నేషనల్ హైవే రహదారులను పరిశీలించి ప్రమాదాలు జరుగు స్థలాలను గుర్తించి అక్కడ బ్లాక్ స్పాట్లుగా ఏర్పాటు చేశారు. దీంతో ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించడంతో స్థానిక ఎస్ఐ ఏ సన్యాసినాయుడు జాతీయ రహదారులపై సోలార్తో పనిచేసే ఐదు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ ప్రమాదాల నియంత్రణకు డివైడర్స్ లైటింగ్ జిగ్ జాగ్ సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నామని, మూడు జిల్లాల రహదారులు కనిపించేలా ఐదు సోలార్ సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గ్రామాల వద్ద పాదచారులు రహదారి దాటే క్రమంలో ప్రమాదలు ఎక్కువగా జరుగుతున్నాయని వీటిని నివారించేందుకు చెర్రీలు చేపట్టామన్నారు. ఈ ప్రాంతాల్లో సెంటర్ డివైడర్పై రైలింగ్ వేయించామన్నారు. లైటింగ్ సరిగా లేకపోవడంతో ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని వాటిని గుర్తించి ఆ ప్రాంతంలో లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు.
