ప్రజాశక్తి-విజయనగరం : ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. సోమవారం పిజిఅర్ఎస్లో కలెక్టర్ ప్రజల నుండి వినతుల స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతి రోజు లాగిన్ అయి అధికారులు వినతులను చూడాలని, రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. సోమవారం పిజిఆర్ఎస్ కు 188 వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ , జేసి సేతు మాధవన్, డిఆర్ఒ శ్రీనివాస మూర్తి, డిప్యూటీ కలెక్టర్లు మురళి, ప్రమీల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 188 అర్జీలు అందగా, భూ సమస్యలకు సంభందించి రెవిన్యూ శాఖకు అత్యధికంగా 80 వినతులు ఉన్నాయి. పింఛన్ల కోసం డిఆర్డిఎకు 30 వరకు వినతులొచ్చాయి.సమయపాలన పాటించాలి ప్రభుత్వ కార్యాలయాలకు హాజరయ్యే అధికారులు సిబ్బంది సమయ పాలన పాటించాలని, ప్రభుత్వ సమయాలలో కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటు లో ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 10.45 గంటలకు అన్ని కార్యాలయాల హాజరు పట్టీ ని ఫోటో తీసి డిఆర్ఒకు పెట్టాలని, ఆలస్యం అయిన వారికీ సిఎల్ మార్క్ చేయాలని సూచించారు. వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగు నీటి సమస్య తెలేత్తకుండా చూడాలని ఎంపిడిఒలకు, ఇఒపిఆర్డిలకు కలెక్టర్ ఆదేశించారు. మండల కేంద్రాల్లో చలి వెంద్రాలను ఏర్పాటు చేయాలనీ తహసిల్దార్లకు సూచించారు.
