ప్రజాశక్తి- మెంటాడ : మండలంలోని గుర్లగెడ్డ మిని రిజర్వాయర్ పూర్తికి నిధులు విడుదల చేసి పూర్తయ్యేలా చూడాలని పలువురు నాయకులు సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం తహశీల్దార్ కోరాడ శ్రీనివాస రావుకు వినతిపత్రం అందజేశారు. దశాబ్దాలుగా ఈ రిజర్వాయర్ అసంపూర్తిగా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీని పూర్తికి నేతల కృషి లోపించడం రైతులకు శాపంగా మారిందని ఆం దోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంత పర్యటనలో ఈ మిని రిజర్వాయర్ పూర్తికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటించి ఆ తర్వాత ఆ ఊసే మర్చిపోయిన విషయాన్ని రైతులు గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి వీలైనంత త్వరగా పూర్తిచేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు చలుమూరి వెంకటరావు, జి అన్నవరం, రెడ్డి ఆదినారాయణ, వైసిపి నేతలు రెడ్డి రాజప్పల నాయుడు, కౌలు రైతుల సంఘం నాయకులు రాకోటి రాములు, లక్ష్మణ రావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
