సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

May 10,2025 20:46

ప్రజాశక్తి – బొబ్బిలి: లేబర్‌ కోడ్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 20న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలోని చర్చి సెంటర్లో శనివారం జీపు జాతాను యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, ఇఫ్టూ జిల్లా అధ్యక్షుడు ఎం.గోపాలం జెండా ఊపి ప్రారంభించారు. చర్చి సెంటర్‌ నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, కార్మిక సంఘాల నాయకులు కె.సురేష్‌, వి.లక్ష్మి, పి.శంకరరావు, పి.లక్ష్మణరావు, ఎం.గోపాలం మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌ చట్టాలను తీసుకురావడం అన్యాయమన్నారు. లేబర్‌ కోడ్‌ చట్టాలతో కార్మికుల హక్కులకు నష్టమన్నారు. లేబర్‌ కోడ్‌ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌.గోపాలం, మున్సిపల్‌ కార్మికులు, అంగన్వాడిలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.రామభద్రపురం: లేబర్‌ కోడ్‌ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 20న జరగనున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద శనివారం జీపుజాతాతో వచ్చి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే. సురేష్‌ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్‌ కోడ్‌ చట్టాలను తీసుకురావడం అన్యాయమన్నారు. ఈ లేబర్‌ కోడ్‌ చట్టాలతో కార్మికుల హక్కులకు నష్టమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ లేబర్‌ కోడ్‌ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు బలసా శ్రీనివాసరావు, అంగన్వాడీ జిల్లా గౌరధ్యక్షలు వి.లక్ష్మీ, పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు రేగిడి: కార్మికుల లేబర్‌ కోడ్‌ రద్దు, కార్మిక సమస్యల పరిష్కారానికి ఈనెల 20న సమ్మెకు కార్మికులంతా సమాయత్తం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్‌, అధ్యక్షులు పి శంకర్రావు అన్నారు. ఈ మేరకు శనివారం ఇఐడి ప్యారి ఇండియా లిమిటెడ్‌ యూనియన్‌ అధ్యక్షులు వై.శ్రీధర్‌ అధ్యక్షతన జీపు జాతకు స్వాగతం పలికారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రద్దుచేసి దాని స్థానంలో కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేందుకు 4 లేబర్‌ కోడ్స్‌ తెచ్చిందని అన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను బ్యాంకు ఇన్సూరెన్స్‌ రంగాలను ప్రైవేటీకరణ చేసి దేశానికి తీవ్ర నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దుర్మార్గమైన విధానాలకు వ్యతిరేకంగా మే 20 సమ్మెలో ఉద్యోగ, కార్మిక వర్గాలు రైతు వ్యవసాయ కార్మికులందరూ పాల్గొవాలని కోరారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకర్రావు మాట్లాడుతూ దేశంలో షుగర్‌ ఫ్యాక్టరీలకు నష్టం చేసే విధానాలు వల్ల రైతులు కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. షుగర్‌ తయారు చేయడం వల్ల ఉపయోగం లేక యాజమాన్యాలు తన లాభాల కోసం ఆల్కహాలు తయారు చేసే దుర్మార్గానికి దిగుతున్నారని అన్నారు. కార్మికులు రైతులు ఐక్యమై షుగర్‌ ఫ్యాక్టరీలు రక్షించుకోవాలని అన్నారు. అందుకే మే 20 సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ విఆర్‌సీ నాయుడు, మజ్జి వెంకటరమణ, ఆరివర్మ, సుధాకర్‌, దారి నాయుడు కార్మికులు పాల్గొన్నారు.

➡️