సిటియులో గిరిజన విద్యార్థులకే అధికంగా సీట్లు కేటాయించాలి

May 5,2025 21:31

ప్రజాశక్తి-విజయనగరం, మెంటాడ : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల్లో గిరిజన విద్యార్థులకే అధికంగా విద్యావకాశాలు కల్పించాల్సి ఉందని రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ డి.వి.జి.శంకరరావు అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత చట్టంలో మార్పులు తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని, ఇదే విషయమై కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు. సోమవారం నగరంలోని గాజులరేగ ప్రాంతంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఆయన సందర్శించారు. సిఐటియు వైస్‌ చాన్సలర్‌ టి.వి.కట్టమణి, ఇతర అధికారులు, అధ్యాపకులతో భేటీ అయి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కోర్సులు, గిరిజన విద్యార్థులకు కల్పిస్తున్న విద్యావకాశాలు, ఈ ప్రాంతంలోని గిరిజనుల అభివృద్ధిలో యూనివర్సిటీ నిర్వహిస్తున్న పాత్రపై చర్చించారు. సిటియు నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. గిరిజన విశ్వవిద్యాలయంలో బోధన సిబ్బంది అవసరమైన సంఖ్యలో లేరని గుర్తించామని, దీంతో అధ్యాపకులు, బోధన సిబ్బందిపై అధికభారం ఉంటోందని గమనించామని శంకరరావు తెలిపారు. దీనిని నివారించేందుకు విశ్వవిద్యాలయ అవసరాలకు తగినట్టుగా అధ్యాపకులు, బోధన సిబ్బందిని నియమించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందని కేంద్రానికి నివేదించనున్నట్టు చెప్పారు. ఈ ప్రాంత గిరిజనులకు ఎదురయ్యే సికిల్‌సెల్‌ ఎనీమియా, ఇతర ఆరోగ్య సమస్యలపై వారిలో అవగాహన కల్పించి వాటి నుంచి రక్షణ కల్పించే దిశగా యూనివర్సిటీ చొరవ చూపాలని కోరారు. తొలుత జెడ్‌పి అతిథి గృహంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌, విజయనగరం ఆర్‌డిఒ కీర్తి తదితరులు ఎస్‌టి కమిషన్‌ చైర్మన్‌ను కలిసి గిరిజన విశ్వవిద్యాలయంలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న చర్యలను వివరించారు.పనులు పరిశీలన అనంతరం మెంటాడ మండలం కుంటినవలస వద్ద యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణ పనులను ఎస్‌.టి.కమిషన్‌ చైర్మన్‌ పరిశీలించారు. ఇంజనీరింగ్‌ అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జాతీయ రహదారి నుంచి విశ్వవిద్యాలయ క్యాంపస్‌కు అనుసంధాన రోడ్డు నిర్మాణం పూర్తిచేయాల్సి ఉందని యూనివర్సిటీ అధికారులు వివరించారు. పనుల పరిశీలనలో బొబ్బిలి ఆర్‌డిఒ రామ్మోహనరావు, యూనివర్సిటీ ఎఒ సూర్యనారాయణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాసరావు, మెంటాడ, దత్తిరాజేరు తహశీల్దార్లు వెంకటరావు, విజయభాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

➡️