ప్రజాశక్తి-విజయనగరం: లీగల్ అసంఘటితరంగ కార్మికులు తమ హక్కులు, చట్టాలు గురించి అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణప్రసాద్ తెలిపారు. మేడే వారోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం న్యాయ సేవా సదన్లో అసంఘటిత రంగ కార్మికులతో సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి. దుర్గయ్య, కృష్ణప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ యాజమాన్యలు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నాయా లేదా, అడిగారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయం గురించి వివరించారు. ఏ విధమైన న్యాయం అవసరమున్నా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని తెలియజేశారు. దుర్గయ్య మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ 2015లో అసంఘటిత భవన కార్మికులకు ఏర్పాటు చేసిన పథకం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ కార్మిక శాఖలో రిజిస్టర్ చేయించుకొని ఈ శ్రమ కార్డులను పొందాలని తెలిపారు. న్యాయ సేవా అధికార సంస్థ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1 5 1 0 0 కి ఫోన్ చేసి న్యాయ సలహాలను పొందవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలపై అవగాహన ఉండాలి రాజాం : కార్మిక చట్టాలు, హక్కులపై అవగాహన ఉండాలని సివిల్ జడ్జి కె.నైమిష అన్నారు. మండల న్యాయ సేవా సంస్థ అధ్వర్యంలో పట్టణం లోని కేశవ జూట్ మిల్ల్స్ లో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వారోత్సవాలలో భాగంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక చట్టాలు, భద్రతా చర్యలు అనే అంశాలపై వివరించారు. కార్మికులు వారిహక్కులకు భంగం వాటిల్లినట్లయితే న్యాయస్థానాలను ఆశ్రయించాలని కోరారు. సహాయ కార్మిక అధికారి బి.కొండలరావు మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల వివిధ పథకాలపై అవగాహన కల్పించారు .ఈ శ్రమ్ పోర్టల్లో నమోదైన అసంఘటిత కార్మికులు ప్రమాదాలు సంభవించినపుడు టోల్ ఫ్రీ నెంబరు 14434కు ఫోన్ చేసి సహాయాన్ని పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్. మురళీధర్, సీనియర్ న్యాయవాదులు, ఆర్. విజరు కుమార్, ఎం. శ్రీనివాసరావు, టౌన్ ఎఎస్ఐ కె.వి.రమణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
