అధ్వానంగా అంతర్గత రహదారులు

May 9,2025 20:20

ప్రజాశక్తి- బాడంగి: మండలంలోని పలు గ్రామాల మధ్య ఉన్న అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. మూడేళ్లుగా మరమ్మత్తులు చేపట్టకపోవడంతో రాకపోకలకు కష్టంగా మారింది. ఆకులకట్ట నుంచి కోటిపల్లి, వాడాడ, జీకేఆర్‌పురం, పినపంకి మీదుగా బొబ్బిలి వెళ్లే రహదారులు చినుకు పడితే చెరువులను తలపించేలా అధ్వానంగా తయారయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్లన్నీ గుంతలుగా మారినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎత్తుపల్లాలుగా మారిన రోడ్లలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. మండల కేంద్రానికి చేరాలంటే నరకయాతన పడుతున్నామని, రోడ్లు అన్నీ గుంతలమయం అయ్యాయని ఎప్పుడు ఏం జరుగుతుందో భయంతో వాహనాలు నడుపుకోవాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పినపంకి, ఆకులకట్ట గ్రామాల మధ్య ఉన్న రోడ్డు మరింత అధ్వానంగా మారింది. ఈ రోడ్డు పై ప్రయాణించాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. దీంతో చేసేదేమీ లేక చుట్టూ తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇటీవలే కురిసిన వర్షానికి రోడ్డు గుంతలమయమై చెరువులు తలపించే విధంగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లన్నీ మరమ్మతులు చేసే విధంగా చూడాలని మండల ప్రజలు వాహనదారులు కోరుతున్నారు. కనీసం గుంతలైనా పూడ్చాలని వేడుకుంటున్నారు.

➡️