సిఐటియు నాయకులు అప్పలరాజు మృతి

ప్రజాశక్తి – గోపాలపట్నం (విశాఖపట్నం) : మోటారు ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ (సిఐటియు) విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అప్పలరాజు గుండెపోటుతో మంగళవారం వేకువజామున రాజాంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పాలకొండ దరి గుళ్లపాడు. సోమవారం ఆయన స్వగ్రామంలోని ఓ వివాహా కార్యక్రమానికి హాజరయ్యారు. మంగళవారం తెల్లవారుజామున గుండెనొప్పి రావడంతో బంధువులు రాజాంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 1991-92 ప్రాంతంలో అప్పలరాజు బతుకుదెరువు కోసం విశాఖకు వచ్చారు. అప్పటి నుంచి కార్మిక ఉద్యమంలో మమేకమయ్యారు. క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. సిఐటియు గోపాలపట్నం డివిజన్‌ కమిటీ సభ్యునిగా, విశాఖ జిల్లా కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా పని చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై కేంద్రీకరించి ఉద్యమించారు. భూపోరాటాలు చేసి పెందుర్తి, గోపాలపట్నం ప్రాంతాల ప్రజల మన్ననలు పొందారు. కార్మికనగర్‌, గాంధీనగర్‌, మీనాక్షమ్మనగర్‌, ఆంజనేయనగర్‌, జ్యోతినగర్‌ ప్రాంతాల్లో ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్యలపై పోరాడారు.

పలువురి నివాళి

అప్పలరాజు సంతాప సభ విశాఖలోని పెందుర్తిలో జరిగింది. తొలుత ఆయన భౌతికకాయం వద్ద సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి సహా పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు నివాళులర్పించారు. మంగళవారం సాయంత్ర పెందుర్తిలో అంత్యక్రియలు నిర్వహించారు.

➡️