సమస్యను పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకి వినతి
ప్రజాశక్తి మద్దిపాడు : గత నెల రోజుల నుంచి గ్రామంలో నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నామని ఇనమనమేల్లూరు గ్రామానికి చెందిన టిడిపి నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గల ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నెలరోజుల నుంచి గ్రామంలో నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గుండ్లకమ్మ నదిలో నీరు లేకపోవడం వల్ల జామ తోటలు కూడా ఎండిపోతున్నాయన్నారు. గుండ్లకమ్మ డ్యామ్ నుంచి రెండు గేట్లు ద్వారా నీటిని విడుదల చేస్తే తమకు నీటి కష్టాలు తప్పుతాయని చెప్పారు. అదేవిధంగా జామ తోట రైతులు కూడా నష్టపోకుండా ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం పొలాల్లో ఉన్న బోరు మోటర్ల ద్వారా గ్రామానికి రెండు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారని చెప్పారు. అధికారులు వెంటనే స్పందించకుంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ నీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా చొరవ చూపాలని నాయకులు కోరారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నైనాల భావనారాయణ, ఊదరగుడి ఆదినారాయణ, దొప్ప సుబ్బారావు, దొప్ప శేషయ్య, బజ్జా మంగమ్మ, భీమవరపు శ్రీనివాసరావు, ఆరుద్ర అనిల్, ఎంపీసీ నగర వాసులు ఉన్నారు.
