10 రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతాం : టిటిడి ఈఓ శ్యామలా రావు

తిరుమల : జనవరి 10 న వైకుంఠ ఏకాదశి సందర్భంగా … 10 రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచుతామని, అందుకు తగిన భద్రతా చర్యలు చేపట్టామని టిటిడి ఈఓ శ్యామలా రావు ప్రకటించారు. మంగళవారం శ్యామలా రావు మీడియాతో మాట్లాడుతూ …. జనవరి 10 ఉదయం 4:30 గంటలకు విఐపీ దర్శనం ఉందన్నారు. 8:30 గంటలకు సామాన్య భక్తులు దర్శనం ఉంటుందన్నారు. ఏకాదశి నాడు స్వర్ణ రథం ఊరేగింపు ఉంటుందన్నారు. 12 గంటలకు వాహన మండపంలో భక్తులు కోసం ఉత్సవమూర్తులుంటారని తెలిపారు. ద్వాదశి నాడు శ్రీవారి పుష్కరిణి లో చక్రస్నానం ఉంటుందన్నారు. 9వ తేది ఉదయం 5 గంటలకు తిరుమల తిరుపతి లో 94 కౌంటర్‌ లో టోకెన్‌ లు కేటాయిస్తున్నామన్నారు. 10, 11, 12 తేదిలకు 9 తేది కేటాయింపులున్నాయన్నారు. తక్కిన రోజుల్లో ఏరోజుకారోజు మూడు ప్రదేశాలలో టోకెన్‌ కేటాయిస్తామన్నారు. ఇప్పటికే ఆన్‌ లైన్‌ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు కేటాయించామన్నారు. ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు ఉన్న వారికే పది రోజుల పాటు దర్శనం, టికెట్లు లేకుంటే దర్శనం లేదు అని స్పష్టం చేశారు. పది రోజుల్లో 7 లక్షలమంది దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశామన్నారు. జనవరి 9 న సర్వదర్శన టికెట్లు జారీ నిలిపివేస్తున్నామని తెలిపారు. సిఫార్సు లేఖలు రద్దు చేశామన్నారు. వసతి ఎవరు ముందు వస్తే వారికే కేటాయిస్తామని చెప్పారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామన్నారు. 12 వేల వాహనాలకు వాహన పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విఐపీలకు రాంభకిఛ వద్దే వాహనాలు అనుమతిస్తామన్నారు. భద్రత పై ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. టోకెన్‌ ఇచ్చే కేంద్రాల వద్ద విజిలెన్స్‌, పోలీసుల సహాయంతో ఏర్పాట్లు చేశామన్నారు. అన్న ప్రసాద కేంద్రం ఉదయం ఆరు గంటల నుండి 12 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఆలయంలో అలంకరణ ప్రత్యేక నిపుణులతో చేయిస్తున్నామన్నారు. మూడువేల శ్రీవారి సేవకుల సేవలు వాడుకుంటామని తెలిపారు. పారిశుధ్యం పై ప్రత్యేక దఅష్టి పెట్టామన్నారు. మహాకుంభమేళ లో టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరగనుందని తెలిపారు. 2.89 ఎకరాల భూమి కుంభమేళా లో కేటాయించారని, అక్కడ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. శ్రీవారి ఆలయంలో జరిగే అన్నీ సేవలు, కైంకర్యాలు నమూనా ఆలయంలో నిర్వహిస్తామన్నారు. జనవరి 18, 26.. ఫిబ్రవరి 3, 26 తేదిలలో కళ్యాణోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. రేపు తిరుమల నుండి కుంభమేళా కి కళ్యాణ రథం ప్రారంభం అవుతుందని శ్యామల రావు వివరించారు.

తిరుపతి జిల్లా యస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ … వైకుంఠ ఏకాదశి కి విఐపీ అధికంగా ఉన్న సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రత కల్పిస్తామన్నారు. పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు టికెట్‌ పైనే రూట్‌ మ్యాప్‌ ఏర్పాటు చేశామన్నారు. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తిరుమల లో రూట్‌ మ్యాప్‌ తెలుసుకోవచ్చునని చెప్పారు. మూడు వేలమందితో వైకుంఠ ఏకాదశి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

➡️