గొడ్డలి వేటుకు కనుమరుగవుతున్న అటవీ సంపద..

నిఘా లోపం అక్రమార్కులకు ఆదాయం..!!
ప్రజాశక్తి, మహానంది :   మహానందిలోని నల్లమల్ల అటవి ప్రాంతంనకు సమీప పరిసర ప్రాంతాల్లో పట్టుడు కర్రలు, వెదురు బంగులు ప్రతినిత్యం అక్రమార్కులు తరలిస్తున్న అధికారులు చూసి చూడనట్లు ఉండడం పలు విమర్శలకు తావిస్తుందని స్థానికులు తెలిపారు. శుక్రవారం తెలుగు గంగ బ్రిడ్జ్‌ సమీపంలో తెలుగుగంగ పిల్ల కాలువ వద్ద వెదురు బంగులను, పట్టుడు కర్రలను అక్రమార్కులు తరలించడానికి సిద్ధంగా ఉంచారు. అదే ప్రాంతంలో కాలువలో సైతం వెదురు బంగులను నిల్వ ఉంచడం జరిగింది.కొందరు అటవీ శాఖ సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలుపడంతోనే దట్టమైన అడవులు మైదాన ప్రాంతాలుగా మారిపోతున్నాయి. కంచె చేను మేసిన చందంగా అధికారుల తీరు కనిపిస్తోంది. అక్రమ రవాణాను అరికట్టాల్సిన సంబంధిత అటవీ అధికారులు చోద్యం చూస్తూ ఉండటంతో లక్షలు విలువైన సంపదను అక్రమార్కులు దోచుకుంటున్నారు. అటవీ సంపద అక్రమ వ్యాపారులకు మహానంది, చలమ రేంజ్‌ రాజమార్గంగా, మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది.

మహానంది,చలమ రేంజ్‌ పరిధిలోని నల్లమల అడవి ప్రాంతం నుంచి అటవీ సంపదను బలెరో వాహనాల్లో అక్రమంగా ప్రతి రోజు తరలిస్తున్న అడ్డుకునే నాధుడే లేడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం కలుషితం కాకుండా మానావళిని కాపాడుతున్న పచ్చని చెట్లను విచ్చలవిడిగా నరికివేస్తున్నారు. యథేచ్ఛగా అటవీ సంపదను తరలిస్తున్నారు. చలమ రేంజ్‌ పరిధిలో నలుదిశలా అడవి విస్తరించి ఉండడంతో, ఏదో ఒక ప్రాంతం నుంచి అటవీ సంపద తరలిస్తూనే ఉంటారు. ఎంతో విలువైన అటవీ సంపదను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నా, పట్టించుకునే వారే లేరని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు రాత్రివేళల్లో మహానంది నల్లమల అడవి ప్రాంతాల నుంచి రహదారి మార్గాల్లో అటవీ సంపద తరలుతోంది. చీకటి, పగలు తేడా లేకుండా తరలిస్తున్నారు. చేయి తడిపితే ఎటువంటి ఇబ్బంది ఉండదని, లేనిపక్షంలో వేలకు వేలు అపరాధ రుసుం వేసి చేస్తున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. విపరీతంగా అటవీ సంపద నరికివేయడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని, వర్షాలు కురవక కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదముంటుందని ప్రకృతి  ప్రేమికులు వాపోతున్నారు. అడవులు కనుమరుగు అవడంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు చెట్ల నరికివేతను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అడవుల సంరక్షణ అనే కార్యక్రమాలు చేపడుతుంటే, మరోవైపు అక్రమార్కులు అటవీ అధికారుల అండతో యథేచ్ఛగా అటవీ సంపద నరుకుతూ అక్రమంగా రవాణా చేస్తున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదం అధికారుల అలసత్వంతో కాగితాలకే పరిమితమైంది. ఇంటి దొంగలే అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అడిగినంత ఇస్తే అడిగే వారే లేరనట్లుగా అధికారుల తీరు మారింది. ఇక్కడ పనిచేసే కొంతమంది అధికారులు అవినీతిలో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో జన సంచారం పై పూర్తి గా నిషేధాజ్ఞలు ఉన్న అక్రమార్కులకు ఆగడాలకు అడ్డుకట్టపడడం లేదు. యథేచ్ఛగా చలమ రేంజ్‌ అడవి ప్రాంతంలో చొరబడుతున్న స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొట్టడంతో పాటు వన్యప్రాణులకు ముప్పును తలపెడుతున్నారు. అయినా జిల్లా ఉన్నతాధికారులు నిస్సహాయత స్థితిలోనే కనిపిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు, అవినీతి అధికారుల ఆగడాలకు అడ్డు లేకుండానే పోతోంది. అవినీతిలో ఆరితేరిన అక్రమార్కుల ఆగడాలు మితిమీరి పోతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అడిగినంత ఇస్తే సరే,లేదంటే అధికారులు అక్రమార్కులను సైతం ముప్పుతిప్పలు పెడుతున్నట్లు చెబుతున్నారు. అందినకాడికి దండుకోవడం అటవీ శాఖ అధికారులకు అలవాటుగానే మారిందంటున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ ఉన్నత అధికారులు, అటవీ సంపద అక్రమ రవాణా పై నిఘా ఉంచి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రకఅతి ప్రేమికులు, రైతులు కోరుతున్నారు.

➡️