ప్రజాశక్తి – ఆచంట
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే వజ్రాయుధమని ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత యువతీ యువకులపై ఉందని ఎఎంసి ఛైర్మన్ చిల్లే లావణ్య అన్నారు. వల్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎలక్ట్రోల్ ఓటింగ్ యంత్రం (ఇవిఎం)పై అవగాహన కార్యక్రమం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిహెచ్ జయలలిత అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎఎంసి ఛైౖర్మన్ చిల్లే లావణ్యతో పాటు ఓటర్లు పాల్గొని ఇవిఎంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్న దేశం మనది అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగాలంటే ఓటు హక్కు కలిగి ఉండాలన్నారు. యువత ఓటు హక్కు కలిగి ఉండి, ఓటు వేయడం బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జివివి.సత్యనారాయణ, వైసిపి నాయకులు ఏనుగుపల్లి వరప్రసాద్, రాగాన శ్రీను, కుసుమే సత్యనారాయణ పాల్గొన్నారు.