ఉపాధి కూలీలకు న్యాయవాదుల అవగాహన

ప్రజాశక్తి – నరసాపురం

నరసాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని సరిపల్లిలో సోమవారం ఉపాధి హామీ కింద పనిచేస్తున్న రోజువారీ కూలీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్యానెల్‌ న్యాయవాదులు డి.నరసింహరాజు, డి.చాముండేశ్వరి పాల్గొని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఇ శ్రమ్‌ వెబ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకుని కార్డు కలిగి ఉండాలన్నారు. ప్రమాదవశాత్తూ అనుకోని సంఘటనలు జరిగినప్పుడు నష్టపరిహారం పొందడానికి ఇ శ్రమ కార్డు ఉపయోగపడుతుంది. అలాగే 14 ఏళ్లలోపు పిల్లలచేత ఎటువంటి కూలి పనీ చేయించకూడదు. బాలల చేత పని చేయిస్తే తల్లిదండ్రులకు, యజమానికి కార్మిక చట్టం ద్వారా జరిమానా, జైలు శిక్ష విధించవచ్చన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ ఆఫీసర్‌ ఎం.వెంకట లక్ష్మీపతి, పిఎల్‌వి ఎం.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.

➡️