ఉపాధి కూలీలకు ఊతం ఉత్తిదే..!

నేడు కలెక్టరేట్‌ వద్ద వ్యకాస ఆధ్వర్యంలో ఉపాధి కూలీల ధర్నా

ప్రజాశక్తి – భీమవరం

ఒకపక్క పూర్తిస్థాయిలో పనులు కల్పించరు. మరోపక్క చేసిన పనికి వేతనాలు ఇవ్వరు. ప్రమాదవశాత్తూ పని ప్రదేశంలో చనిపోతే అందించే సాయం కూడా అరకొరే. ఇంకో పక్క యాప్‌ల భారం, రాజకీయ వేధింపులు ఇలా చెప్పుకుంటూపోతే ఉపాధి కూలీలు అనేక సమస్యలతో సహవాసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేతన బకాయిలు చెల్లించాలని, పని దినాలు, వేతనాలు పెంచాలని, యాప్‌ ద్వారా మస్తర్‌ విధానాన్ని తొలగించాలని, సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించేందుకు కూలీలు సన్నద్ధమయ్యారు.జిల్లాలో 2,94,028 మంది కూలీలు ఉన్నారు. సుమారు 1,78,363 జాబ్‌ కార్డులు ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌ నుంచి కొంతమందికి, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ చేసిన పనులకు కనీస వేతనాలు అందించలేదు. దీంతో కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చేసిన పనులకు 15 రోజుల్లో వేతనాలివ్వాలని చట్టం చెబుతున్నా అమలుకు నోచుకోవడం లేదు. కింద స్థాయిలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా జిల్లాలో రూ.25,42,80,973 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఉపాధి హామీకి బడ్జెట్లో నిధులు తగ్గించారు. ఇటీవల కాలంలో కూలీలపై పనిభారం మరింత పెరిగింది. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ ద్వారా మస్తర్‌ విధానం వల్ల పనిచేయడం ఒక భాగం అయితే కూలీలు కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పని ప్రాంతంలో నామమాత్రంగానే సౌకర్యాలు కల్పిస్తున్నారు. పంట, మరుగు కాలవల్లో గుర్రపుడెక్క, తూడు, చెత్త తొలగింపు, జంగిల్‌ క్లియరెన్స్‌ వంటి పనులు నామమాత్రంగానే కల్పిస్తున్నారు. జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉంటే సంబంధిత నాయకులు ఫీల్డ్‌ అసిస్టెంట్లు, మేట్లపై రాజకీయ ఒత్తిడులు తెచ్చి వేధింపులకు గురి చేస్తున్నారు. దీంతో చట్టం నిర్వీర్యం అయిపోతోంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో జిల్లాలో పని దినాలు రాను రాను తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వంద రోజులు కూడా పని కల్పించలేని పరిస్థితి ఉంది. అయితే దీన్ని 200లకు పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ప్రధానంగా డిమాండ్‌ చేస్తోంది. పనిచేసినప్పటికీ అరకొరగానే వేతనాలు ఇస్తున్న పరిస్థితి. ప్రభుత్వం రూ.307 కనీస వేతనం అందించాలని చెబుతున్నప్పటికీ రూ.600 పెంచాలని డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ఇదిలాఉంటే పని చేసే ప్రాంతాలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. విషసర్పాలు, తేనె టీగలు, తాగి పడేసిన మద్యం బాటిల్స్‌ గాజు పెంకుల వల్ల ప్రమాదాల బారిన పడుతున్న వారు అనేకమంది ఉన్నారు. అయితే వీరికి అరకొరగానే వైద్య సేవలు అందజేస్తున్నారు. వారి జీవన స్థితిగతులు అధ్వానంగా మారుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉపాధి కూలీలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భీమవరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.మూడు నెలలైనా వేతనాలు రాలేదు తిరుమాని వీర వెంకట సత్యనారాయణ, వేములదీవి తూర్పు పనులు చేస్తే రోజులు గడిచాయి. అడుగుతున్న అదిగో ఇదిగో అంటున్నారు. ఇప్పటికి మూడు నెలలైంది. 15 రోజుల్లో వేతనాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ దాని ఊసే లేదు. చట్టం ఉన్నా అమలు కావట్లేదు. మూడు నెలల నుంచి డబ్బులు ఇవ్వకపోతే ఎలా బతకాలి. ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.ప్రమాదకరంగా పని ప్రదేశాలు కొల్లు రత్నం, వేములదీవి తూర్పు పని ప్రదేశాలు ప్రమాదకరంగా ఉన్నాయి. అయినా పనులు చేస్తున్నాం. విషసర్పాలు. విషపు తేనెటీగల దాడికి తరచూ గురవుతున్నాం. గాజు పెంకులతో గాయాలవుతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్న కొంతమంది పనులు చేయడం లేదని మాట్లాడడం సరికాదు. పని ప్రాంతంలో సౌకర్యాలు, మెడికల్‌ కిట్లు ఏర్పాటు చేయాలి.కిలో మీటర్ల మేర నడవాల్సి వస్తోంది జుత్తిగ కుమారి, కేశవరం ఫొటోల ద్వారా మస్తర్‌ వేయడం, పని చేయడం ఒక భాగం అయితే ఫొటో దిగడానికి అనేక కిలోమీటర్లు నడవడం పెద్ద భారంగా మారింది. దీనికితోడు చేసిన పనికి డబ్బులు వెంటనే అందించడం లేదు. బతకడం చాలా కష్టంగా ఉంటుంది. పనులు చేయించుకోవడంలో ఉన్న శ్రద్ధ డబ్బులు వేయడంలో అధికారులకు ఉండడం లేదు. ఇది సరికాదు.రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలి కవురు పుష్పావతి, మునమర్రు వ్యవసాయ పనులు సరిగ్గా ఉండడం లేదు. ఉపాధి పనులు సక్రమంగా చూపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కూలీల బతుకులు కష్టంగా మారుతున్నాయి. ఉపాధి పనులు 100 నుంచి 200 రోజులకు పెంచాలి. రోజుకు రూ.600 వేతనం చెల్లించాలి. పెరిగిన ఖర్చులకు అందిస్తున్న వేతనాలకు పొంతన ఉండడం లేదు. ప్రభుత్వం ఆలోచన చేసి వేతనాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి.బకాయిలు విడుదల చేశారు జక్కంశెట్టి సత్యనారాయణ, వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి విజన్‌-2047 అని గొప్పలు చెబుతున్నారు.ఈ ప్రభుత్వానికి ఉపాధి కూలీల సమస్యలు పట్టడం లేదు. జిల్లాలో 723386 పనిదినాలకు రూ.25.42 కోట్ల వేతన బకాయి ఉంది. తక్షణం వీటిని విడుదల చేయాలి. ఉపాధి పని చేసిన 15 రోజుల్లో వేతనాలు ఇవ్వకపోతే వడ్డీతో సహా చెల్లించాలని చట్టం చెబుతోంది. పనిచేసి సుమారు 120 రోజులు గడుస్తున్నా నేటికీ వేతనాలు ఇవ్వకపోతే కూలీలు ఎలా బతుకుతారు. పాలకులు కనీసం పట్టించుకోకపోవడం దారుణం.

➡️