హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సిఐటియు ఆధ్వర్యాన ధర్నా

ప్రజాశక్తి – తణుకు

హమాలీ కార్మికులకు వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పీవీ. ప్రతాప్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక స్టేట్‌ వేరింగ్‌ హౌసింగ్‌ కార్పొరేషన్స్‌ గోడౌన్స్‌ (ఎస్‌డబ్ల్యూయుసిి) వద్ద హమాలీ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నిరసన ధర్నా చేపట్టారు. హమాలీ కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కార్మికులకు రూ.10 లక్షలు ప్రమాద బీమా అమలు చేయాలని, ఎస్‌డబ్ల్యూయుసి పని చేస్తున్న కార్మికులకు ఇఎస్‌ఐ అమలు చేయాలని, కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలని, లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ హమాలీ కార్మికుల కోసం 1976లో చేసిన చట్టం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటినా నేటికీ హమాలీ కార్మికులకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదన్నారు. లేబర్‌ కోడ్స్‌ ప్రకారం రోజూ వేతనం రూ.178 నిర్ణయించడం బాధాకరమన్నారు. ఒక పక్క అన్ని రకాల ధరలూ పెరుగుతుంటే, తగ్గించడం చేతగాక రోజు వారీ వేతనం రూ.178 చెప్పడం శోచనీయమన్నారు. సిఐటియు మాత్రం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.26 వేలు ఇవ్వాలని కోరుతోందని తెలిపారు. అనంతరం గోడౌన్‌ మేనేజర్‌కు సమ్మె నోటీస్‌ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శీలబోయిన శ్రీనివాసరావు, చిటికెన నాగబాబు, ఎస్‌.గోవింద్‌, సత్తిబాబు, నూకరాజు, రమణబాబు, భాషా, డి.శ్రీను, ఆసూరి రాజు, పద్దయ్య, శంకరం, ఏసు, రమణ, సూర్యనారాయణ, ఏడుకొండలు, గార రంగారావు పాల్గొన్నారు.

➡️