జిల్లా కలెక్టర్ నాగరాణి
ప్రజాశక్తి – నరసాపురం
నరసాపురంలో నిర్వహించే ‘హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో’ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. న్యూఢిల్లీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్ వారి ఆధ్వర్యంలో నరసాపురంలో నిర్వహించనున్న ‘హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్పో’ను ప్రజలు తిలకించాలని కలెక్టర్ తెలిపారు. మనం వివిధ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించే వస్తు, వస్త్ర ప్రదర్శనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మార్చి 21 నుంచి 25వ తేదీ వరకూ ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ నరసాపురం రుస్తుంబాద కొత్త కాలవ రోడ్డులోని ఇంటర్నేషనల్ లేస్ ట్రేడ్ సెంటర్ వద్ద ‘హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్ పో’ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఎక్స్ పోలో దేశంలో ప్రసిద్ధిగాంచిన హ్యాండీ క్రాఫ్ట్స్, ఫ్యాషన్ జ్యుయిలరీ, గృహోపకరణాలు, హోమ్ ఫర్నీషింగ్, లేసు ఉత్పత్తులు, కలంకారీ శారీస్, ఫ్యాషన్ హ్యాండ్ బ్యాగ్స్, రెడీమేడ్ వస్త్రాలు, తదితర వస్తువుల ప్రదర్శన, అమ్మకం ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.