ప్రజాశక్తి – వీరవాసరం
యుక్త వయసులో బాలికలకు శారీరక శ్రమ ఎంతో అవసరమని ఎంపిపి వీరవల్లి దుర్గభవాని చంద్రశేఖర్ అన్నారు. తోలేరులోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించిన కిషోర్ వికాసం వేసవి శిక్షణ కార్యక్రమంలో ఎంపిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిపి బాలికలతో కొద్దిసేపు ఆటలు ఆడుతూ, శారీరక శ్రమ వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. ప్రతి బాలిక తమ శరీరాన్ని పిట్గా ఉంచుకోవడానికి ఆటలు ఆడుతూ ఉండాలని, దీంతోపాటు సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా పూర్తిస్థాయి ఆరోగ్యాన్ని పొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి, గంగాభవాని, వెంకటేశ్వరమ్మ, నిర్మల, చిట్టి, లక్ష్మీదేవి, వెంకట నరసమ్మ పాల్గొన్నారు.
ఇండియన్ ఆర్మీ కృషి అభినందనీయం
ఎంఎల్ఎ ఆరిమిల్లి
తణుకు : పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ఎంఎల్ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఇండియన్ ఆర్మీకు వాసవిమాత కటాక్షం ఉండాలని కోరారు. వాసవిమాత జన్మదినం పురస్కరించుకుని తణుకులోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని బుధవారం తణుకు ఎంఎల్ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవమునకు హాజరై ఆలయంలో నిర్వహిస్తున్న పూజల్లో పాల్గొన్నారు.
కొనసాగిన వేసవి శిక్షణ తరగతులు
తాడేపల్లిగూడెం: అక్షరజ్ఞానంతో విద్యార్థుల భవితకు బాటలు వేసుకోవాలని ప్రథమ శాఖ గ్రంథాలయాధికారి వి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం 10వ రోజు వేసవి శిక్షణ తరగతులలో భాగంగా జనవిజ్ఞాన వేదిక కన్వీనర్ ప్రత్తి వీరాస్వామి విద్యార్థులకు నీతికథలు వినిపించి, గ్రంథాలయంలో పుస్తకాలు చదివించారు. జనార్థనరావు పుస్తక సమీక్ష, దేశభక్తి పాటలు పాడించారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా కోపెళ్ల శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం వేసి విద్యార్థులకు బోధించారు. బుధవారం వేసవి శిక్షణ తరగతులకు 40 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పెనుమంట్ర : పాఠశాల వయస్సు పిల్లలంతా తమ మానసిక వికాశం కోసం చదరంగం నేర్చుకోవాలని గ్రంథాలయ అధికారి పిటి.శివకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని శాఖా గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరంలో పాల్గొన్న పిల్లలకు చదరంగం గురించి వివరించారు. ఈ శిబిరంలో కె.జాస్మిత రెడ్డి, కె.శివాణి, ఎన్.లక్ష్మి ప్రసన్న, కె.తనీషా, కె.ఫణిశ్రీ నికిల్ రెడ్డి, జి.లోచన్, జి.తేజశ్రీ పాల్గొన్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి : ఎంఎల్ఎ
తణుకు : ఆసుపత్రికి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని తణుకు నియోజకవర్గ ఎంఎల్ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులకు సూచించారు. బుధవారం రాధాకృష్ణ తణుకు పట్టణంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అత్యవసర విభాగంలో రికార్డులను పరిశీలించారు. ఆయనతో పాటు మున్సిపల్ కమిషనర్ టి.రామ్కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆసుపత్రి ఆర్ఎంఒ సాయిబాలాజీ, హెడ్ నర్సు లలిత ఉన్నారు.
‘బిజిబిఎస్ కాలేజీ అస్తులకు రక్షణ కల్పించాలి’
నరసాపురం: ఎంతో మందికి విద్యను అందించి వారి భవిష్యత్ను తీర్చిదిద్దిన బిజిబిఎస్ కాలేజీ అస్తుల్ని పాలకవర్గం సభ్యులు దొంగ తీర్మానాలు చేసి అమ్మేసారంటూ కోట్ల రామ్ కుమార్, కావలి నాని, ముచర్ల త్రిమూర్తులు, డాక్టర్ రాజ్యలక్ష్మి, ఝాన్సీలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కాలేజీ అస్తుల్ని రక్షించాలంటూ ముందుగా పద్మశ్రీ అద్దేపల్లి సర్వేశెట్టి విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూల దండలు వేసి నివాళులు అర్పించారు. కాలేజీ అభివృద్ధి జరిగాలి, ఆస్తుల్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. పాలకవర్గం ఇదే తీరును అవలంబిస్తే దశల వారీగా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పిడి రాజు, మండా రాజా, సిహెచ్.సుబ్రహ్మణ్యం, సమయంతుల సర్వేశ్వరరావు, తెలనాకుల విజరుకుమార్ పాల్గొన్నారు.
విద్యార్థుల మనోవికాసానికి క్రీడలు దోహదం : ఎంఎల్ఎ
తాడేపల్లిగూడెం : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయని ప్రభుత్వ విప్, స్థానిక ఎంఎల్ఎ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మిలటరీ మాధవరం గ్రామంలోని హైస్కూల్లో సమ్మర్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. అనంతరం ఎంఎల్ఎ బొలిశెట్టి క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ ఆడి, నిర్వాహకులను ఉత్సాహపరిచారు. గ్రామ సర్పంచి ముప్పిడి సూర్యకుమారి, లక్కోకుల ప్రసాద్ పాల్గొన్నారు.