హిమోఫిలియా’ రోగుల పట్ల ఏలూరు సర్వజన ఆసుపత్రి యంత్రాంగం తీరు దారుణం
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
రక్తం గడ్డుకుని శరీరంలో వాపులు ఏర్పడి తీవ్ర ఇబ్బందులు పడే హిమోఫిలియా రోగుల పట్ల ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రక్తం గడ్డుకునే తరుణంలో హిమోఫిలియా రోగులకు వెంటనే సంబంధిత ఇంజెక్షన్ ఇస్తేనే ఉపశమనం కలుగుతుంది. ఆలస్యమయ్యే కొద్దీ అంతర్గత రక్తస్రావంతో వచ్చే నొప్పిని తట్టుకోవడం చాలా కష్టమని రోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. హిమోఫిలియా రోగం పుట్టుకతోనే వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి. ఈ రోగులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 250 మంది వరకూ ఉండగా, రాష్ట్రంలో రెండు వేల మందికిపైగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ రోగానికి ఎటువంటి మందులూ పని చేయవు. ఈ రోగాన్ని గుర్తించిన తర్వాత హిమోఫిలియా సొసైటీలు ప్రత్యేక ఐడి కార్డులు సైతం జారీ చేశాయి. ఈ రోగాన్ని అదుపు చేయాలంటే సంబంధిత ఇంజెక్షన్ ఒక్కటే మార్గం. ఈ ఇంజెక్షన్ ప్రభుత్వం మాత్రమే సరఫరా చేస్తోంది. గుంటూరు, విజయవాడ, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రతి జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ చేసే సదుపాయం ఉన్నట్లు రోగులు చెబుతున్నారు. రక్తం గడ్డుకునే సమస్య ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఏదైనా పొరపాటున దెబ్బతగిలితే రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. ఏం చేసినా అదుపు చేయడం కష్టం. వెంటనే ఇంజెక్షన్ చేయించాల్సిందే. అతేకాకుండా ఒక పక్కగా ఎక్కువసేపు కూర్చున్నా, పడుకున్నా రక్తం గడ్డకట్టే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా జరిగినప్పుడు ఇంజెక్షన్ చేయించుకోవాల్సిందే. ఒకోసారి నెలలో నాలుగైదుసార్లు, అంతకంటే ఎక్కువసార్లు సైతం ఇంజెక్షన్ చేయాల్సి వస్తోంది. హిమోఫిలియా రోగులను ఎమర్జెన్సీ రోగులగా పరిగణించి వైద్యం అందిస్తారు. గతంలో హిమోఫిలియా రోగులు వస్తే వెంటనే ఇంజెక్షన్ చేసి పంపించేవారు. గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు వెళ్లినా హిమోఫిలియా రోగులకు అర గంట, గంట వ్యవధిలోనే ఇంజెక్షన్ ఇస్తుంటే ఏలూరు సర్వజన ఆసుపత్రిలో అసలు పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉదయం వస్తే సాయంత్రం వరకూ నరకయాతన హిమోఫిలియా రోగులు ఏలూరు సర్వజన ఆసుపత్రికి ఉదయం తొమ్మిది గంటలకు వస్తే సాయంత్రం నాలుగు గంటల వరకూ ఇంజెక్షన్ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వైద్యుల సంతకాలు కాలేదని కొంతసమయం, సూపరింటెండెంట్ సంతకం కాలేదని కాలయాపన చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తిండితిప్పలు లేకుండా సాయంత్రం వరకూ అక్కడే ఉంటున్నా వైద్యులు, సిబ్బంది కనీసం కనికరం చూపించని దుస్థితి నెలకొంది. దీంతో హిమోఫిలియా రోగులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. గత మంగళవారం ఇద్దరు హిమోఫిలియా రోగులు ఉదయం తొమ్మిది గంటలకు ఏలూరు సర్వజన ఆసుపత్రికి రాగా, ఇంజెక్షన్ చేసేందుకు వైద్యులు, సిబ్బంది పెట్టిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. పెద్దఎత్తున వాగ్వివాదం జరిగాక సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఇంజెక్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఎమర్జెన్సీ రోగుల పట్ల వైద్యులు, సిబ్బంది ఈ విధంగా వ్యవహరించడంపై అక్కడ ఉన్న రోగులు సైతం అయ్యో.. పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.ముప్పుతిప్పలు పెడుతున్న ఎన్టిఆర్ వైద్యసేవా సిబ్బంది ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పనిచేసే ఎన్టిఆర్ వైద్యసేవా సిబ్బంది హిమోఫిలియా రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏ ఆసుపత్రిలో లేని విధంగా ఇక్కడ సిబ్బంది వ్యవహరిస్తున్నారని రోగులు చెబుతున్నారు. రోగులు ఎప్పుడొచ్చినా ఇంజెక్షన్ చేయాలని నిబంధన ఉన్నప్పటికీ ఇటీవలే ఇంజెక్షన్ చేశారు కాబట్టి కుదరదని మాట్లాడుతున్నారు. పైగా వైద్యులు ఎన్టిఆర్ వైద్యసేవలో నమోదు చేయించుకోవాలని చెబుతున్నారు. దీంతో అటు, ఇటు తిరగలేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లయినా ఇంజెక్షన్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఎవరైనా వచ్చి గట్టిగా మాట్లాడితే అప్పుడు స్పందిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఎన్టిఆర్ వైద్యసేవా సిబ్బందికి సంబంధిత ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని రోగులు కోరుతున్నారు.ఉదయం వస్తే సాయంత్రం వరకూ ఇబ్బంది పెడుతున్నారుసాహో జయంత్, హిమోఫిలియా బాధితుడు, ఏలూరు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఏలూరు సర్వజన ఆసుపత్రికి వస్తే సాయంత్రం వరకూ ఇంజెక్షన్ చేయలేదు. సంతకాలు కాలేదని చెబుతూ వచ్చారు. ఏ జిల్లాలోనూ ఇటువంటి పరిస్థితి లేదు. బాధ భరించలేని స్థితికి వస్తోంది. హిమోఫిలియా బాధితులకు వెంటనే ఇంజెక్షన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి అధికారులను కోరుతున్నాం.ఎన్టిఆర్ వైద్యసేవ, ఆసుపత్రి సిబ్బంది తీరుతో తీవ్ర ఇబ్బందులుడి.వెంకటేష్, బాధితుడు, ఛానమిల్లి హిమోఫిలియా రోగులను ఏలూరు సర్వజన ఆసుపత్రిలో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఇంజెక్షన్ చేసేందుకు సాయంత్రం వరకూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎన్టిఆర్ వైద్యసేవా సిబ్బంది సరిగా స్పందించడం లేదు. ఆసుపత్రి సిబ్బందీ అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. రోగంతో ఉన్న మమ్మల్ని పైకి, కిందకు పదేపదే తిప్పుతున్నారు. ఇంజెక్షన్ ఆలస్యం అవుతుండటంతో నొప్పిని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. త్వరగా ఇంజెక్షన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.