పత్తా లేని బ్యాంక్ మేనేజర్, దళారీ
ప్రజాశక్తి – నరసాపురం
నరసాపురం సెంట్రల్ బ్యాంకులో చేపల చెరువుల నకిలీ లీజు అగ్రిమెంట్లతో ఆయా చెరువుల యజమానులకు తెలియకుండానే సుమారు రూ.4 కోట్లు రుణం పొందిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ సర్దుకొడప గ్రామానికి తిరుమాని నాగరాజు, శ్రీనివాస్, వడ్డి కాసులు, పద్మావతి పేరిట సుమారు 19 ఎకరాల భూమిపై సుమారు రూ.4 కోట్ల రుణాలు దూది చంద్రశేఖర్, కె.ప్రసాద్ పొందినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సెంట్రల్ బ్యాంక్ విజయవాడ రీజనల్ కార్యాలయం నుండి మంగళవారం నలుగురు అధికారులు బ్యాంకుకు వచ్చి విచారణ చేపట్టారు. అప్పటికే బ్యాంక్ మేనేజర్ టి.ప్రకాశం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో బ్యాంకు అధికారలుఉ సిబ్బందిని విచారించి, పలు డాక్యుమెంట్లు పరిశీలించి వెనుదిరిగారు. సెంట్రల్ బ్యాంకులో రుణాల కుంభకోణం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బ్యాంకర్లు దళారీల ద్వారా వెళ్తే వెంటనే రుణాలిచ్చి కమీషన్లు తీసుకుంటున్నారని, న్యాయబద్దంగా అన్ని పత్రాలతో నేరుగా బ్యాంకుకు వెళ్తే కనీసం సమాధానం చెప్పడం లేదని పలువురు ఆరోపించారు. ఈ కేసులో రుణాలిప్పించడంలో కీలకంగా వ్యవహరించిన దళారీ కొప్పినీడి మాధవ్, బ్యాంక్ మేనేజర్ను సంబంధిత అధికారులు సరైన రీతిలో విచారించలేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. 2020లో మృతి చెందిన వ్యక్తి పేరిట 2024లో రుణం ఎలా ఇచ్చారనే అంశంపై లోతైన విచారణ జరిపితే చాలా కుంభకోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కొందరు మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసును రాజీ చేసే ప్రయత్నాలు పెద్దఎత్తున సాగుతున్నట్లు తెలుస్తోంది.