ప్రజాశక్తి – భీమవరం
కేరళలోని కమ్యూనిస్టు వామపక్ష ప్రభుత్వంపై, ప్రజల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్షసాధింపు వైఖరి తగదని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్వి.గోపాలన్ అన్నారు. కేరళ రాష్ట్రానికి కేంద్రం బిజెపి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు, కార్మిక ప్రజాసంఘాలు చేస్తున్న నిరసనల్లో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ కేరళలోని వామపక్ష ప్రభుత్వం ఆదర్శవంతమైన పాలన అందిస్తోందన్నారు. అటువంటి వామపక్ష ప్రభుత్వాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజకీయ కుట్రతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తోందని విమర్శించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో వరదలకు కొండ చర్యలు విరిగిపడి వేల మంది చనిపోయారని, వేలకోట్ల రూపాయల నష్టం జరిగిందని దీనిపై ప్రపంచం అంతా స్పందించినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజల ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు ధారపోస్తూ, ప్రజలపై భారాలు వేస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న బిజెపి, మోడీ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడారు. రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, కౌలురైతు సంఘాల నాయకులు బి.వాసుదేవరావు, బి.జార్జి, ఎం.ఆంజనేయులు, ఎం.వైకుంఠరావు, టి.రాము, డి.త్రిమూర్తులు, పి.మృత్యుంజయ, జి.నాగేశ్వరరావు, గోపాలకృష్ణంరాజు, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.