ప్రజాశక్తి-పాలకొల్లు : ఏ పనైనా ఆదేశాలు ఇచ్చి చేయించడం కంటే ఆచరించి చూపిస్తేనే ప్రజలు అనుసరిస్తారని రాష్ట్ర జలవనురుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు మండలం చింతపర్రు అరుంధతి పేటలో ఆదివారం అంబేద్కర్ విగ్రహ స్లాబ్ నిర్మాణ పనుల్లో మంత్రి రామానాయుడు శ్రమదానం చేశారు. స్లాబ్ పనుల్లో కార్మికులతో కలిసి ఇసుక కంకర సిమ్మెంటును గమేలతో మోసారు. అంబేద్కర్ విగ్రహ స్లాబ్ ను సొంత ఖర్చులతో నిర్మించడంతో పాటు పనుల్లోను కార్మికులతో మనకమైనారు. నియోజకవర్గంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలన్నిటికీ స్లాబ్ నిర్మాణాలను దశల వారీగా పూర్తి చేస్తానని తెలిపారు. మహనీయుల విగ్రహాల స్థాపన, వాటి పరిరక్షణ పనుల్లో స్వయంగా పాల్గొంటే ఎంతో సంతృప్తినిస్తుందని మంత్రి నిమ్మల చెప్పారు. పాలకొల్లు నియోజకవర్గంలో అంబేద్కర్ జయంతి వేడుకలను సంవత్సరం పొడవునా ఘనంగా నిర్వహించానని మంత్రి చెప్పారు. డా. బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని మంత్రి చెప్పారు. డా.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ వాదిగా ప్రజాసేవలో నిరంతరం శ్రమిస్తున్నానని మంత్రి నిమ్మల అన్నారు.
