ప్రజాశక్తి – తణుకు
రాబోయే రోజుల్లో తణుకు నియోజకవర్గం క్రీడల నిర్వహణకు వేదికగా నిలిపేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఎంఎల్ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన బాస్కెట్ బాల్ టోర్నమెంట్ ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవంలో ఎంఎల్ఎ రాధాకృష్ణ పాల్గొని బహుమతులు అందజేసి మాట్లాడారు. గతంలో క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధించినప్పటకీ ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి నానా అవస్ధలు పడేవారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో దేశ విదేశాల్లో ఎక్కడ పధకాలు సాధించినప్పటకీ ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో ప్రాధాన్యత ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంఎల్ఎ ఆర్థిక సహకారంతో మొదటి స్థానంలో నిలిచిన విజేతకు రూ.15 వేలు, రెండో స్థానంలో నిలిచిన విజేతకు రూ.10 వేలు, మూడో స్థానంలో నిలిచిన విజేతకు రూ.7 వేలతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రూ.3 వేలు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.