మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం తాడేపల్లిగూడెం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆప్కాస్‌ విధానాన్ని రద్దు చేసి ప్రయివేటు ఏజెన్సీలకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. గత సంవత్సరం మున్సిపల్‌ కార్మికులు నిర్వహించిన 17 రోజుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలకు జిఒలు ఇచ్చి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలన్నారు. ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో మున్సిపల్‌ కార్మికులు పాల్గొంటారని, కార్మికుల సమస్యలపై కొనసాగింపు సమ్మె ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు తాడికొండ జయరాం కృష్ణ, కొడమంచిలి బాబు, తాడికొండ శ్రీను, ధనరాజ్‌, ధనాల శివయ్య, కళ్లేపల్లి మంగ నాయకత్వం వహించారు.

➡️