ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్లో బిసి-ఇ (ముస్లిం మైనార్టీ) కేటగిరికి తీరని నష్టం కన్పిస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారుల తప్పిదంతో ముస్లిం మైనార్టీ కేటగిరిలో పది ఎస్జిటి పోస్టులు, గుడి, చెవుడు అంగవైకల్య కేటగిరిలో దాదాపు 15 పోస్టులు కోల్పోయిన పరిస్థితి. జిల్లాలో ఉపాధ్యాయ ఖాళీలకు సంబంధించి రాష్ట్ర కేంద్రానికి ఇచ్చిన నివేదికలో జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తిననట్లు తెలుస్తోంది. దీంతో తమ కేటగిరికి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టులను డిఎస్సి నోటిఫికేషన్లో పొందుపరచాలంటూ బిసి-ఇ సామాజిక తరగతిలో అర్హులైన అభ్యర్థులంతా కోరుతున్నారు. 2014లో టిడిపి ప్రభుత్వ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. ముస్లిం మైనార్టీ (బిసి-ఇ) కేటగిరికి సంబంధించి మొత్తం 36 పోస్టులను పొందుపరిచింది. వాటిలో పురుషులకు 24, మహిళలకు 12 పోస్టులు ఉన్నాయి. డిఎస్సి పరీక్షలో 26 మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో ఎనిమిది మహిళ, రెండు పురుషులకు సంబంధించిన ఖాళీలు అలానే ఉండిపోయాయి. 2018లో మరోసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ జిల్లా, మండల పరిషత్ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు లేనట్లు చూపించారు. దీంతో బ్యాక్లాగ్ పోస్టులు చూపించలేదని అప్పట్లో చెప్పుకొచ్చారు. 2022లో తక్కువ సంఖ్యలో 550 బ్యాక్లాగ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి వైసిపి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. తక్కువ సంఖ్యలో ఇచ్చిన కారణంగా 2014లో మిగిలిపోయిన బ్యాక్లాగ్ పోస్టుల ఖాళీలు చూపించకుండా వదిలేశారు. 2024లో ఎన్నికల ముందు వైసిపి ప్రభుత్వం 6,100 ఖాళీలతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో వంద ఎస్జిటి పోస్టులు అందులో ఉన్నాయి. ముస్లిం మైనార్టీలకు సంబంధించి బిసి-ఇ కేటగిరిలోని గతంలో మిగిలిపోయిన పది బ్యాక్లాగ్ పోస్టులను చూపించారు. దీంతో ఆ సామాజిక తరగతి అభ్యర్థులంతా ఆనందపడ్డారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైసిపి ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సిని రద్దు చేసింది. మెగా డిఎస్సి పేరుతో 2025 ఏప్రిల్ 20న నూతనంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,035 పోస్టులకు సంబంధించి ఖాళీలను నోటిఫికేషన్లో చూపించారు. ఇందులో 420 ఎస్జిటి పోస్టులు ఉన్నాయి. ఇందులో బిసి-ఇ కేటగిరిలో ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కింద 16 పోస్టులు మాత్రమే ఖాళీలు చూపించారు. గతంలో మిగిలిన బ్యాక్లాగ్ పది పోస్టులను చూపించలేదు. నిబంధనల ప్రకారం వాటిని కూడా కలిపి 26 పోస్టులు చూపించాల్సిన ఉన్నప్పటికీ అలా జరగలేదు. ఉర్దూ పోస్టులకు సంబంధించి మూడు బ్యాక్లాగ్ పోస్టులను చూపించి సరిపెట్టారు. దీంతో బిసి-ఇ సామాజిక తరగతికి సంబంధించిన అభ్యర్థులు ఈ డిఎస్సిలో పది పోస్టులను కోల్పోయిన పరిస్థితి నెలకొంది. జిల్లా విద్యాశాఖాధికారులు బ్యాక్లాగ్ పోస్టుల వివరాలను రాష్ట్ర కేంద్రానికి పంపకపోవడమే ఈ తప్పిదానికి కారణమని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విజువల్, ఇయరింగ్ బ్యాక్లాగ్ పోస్టుల్లోనూ అదే నిర్లక్ష్యం 2014 డిఎస్సిలో విజువల్ (గుడ్డి) కేటగిరిలో 24 పోస్టులకుగాను ఆరు మాత్రమే భర్తీ చేశారు. ఇంకా 18 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. ఇయరింగ్ (చెవుడు) కేటగిరిలో 11 పోస్టులకు నాలుగు మాత్రమే భర్తీ చేయగా ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళలకు సంబంధించి ఇదే కేటగిరిల్లో పది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 35 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నప్పటికీ ప్రస్తుత డిఎస్సిలో చూపించలేదు. 2022లో చూపించిన 15 పోస్టులకు సంబంధించి కోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పటికీ మిగిలిన 15 పోస్టులు కూడా చూపించని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారంతా కోరుతున్నారు.బ్యాక్లాగ్ పోస్టులు చూపించొద్దన్నారుఎం.వెంకటలక్ష్మమ్మ, డిఇఒ బ్యాక్లాగ్ పోస్టులపై కోర్టులో ఉండటం కారణంగా చూపించొద్దన్నారు. అందుకే ప్రస్తుత డిఎస్సిలో చూపించలేదు. బ్యాక్లాగ్ పోస్టులు భర్తీచేసేటప్పుడు వీటిని భర్తీ చేస్తారు. 2024 వైసిపి ప్రభుత్వంలో ఇచ్చిన డిస్సిలో పొందుపరిచిన పోస్టులు, 2025 డిఎస్సిలో ఎందుకు లేవన్న ప్రశ్నకు మాత్రం డిఇఒ నుంచి సరైన సమాధానం రాని పరిస్థితి నెలకొంది. కోర్టులో ఉన్నది గుడ్డి, చెవుడు బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినవని, ముస్లిం మైనార్టీ బిసి-ఇ కేటగిరికి సంబంధించినవి కావుగా అనే ప్రశ్నకు డిఇఒ సమాధానం ఇవ్వలేదు.