పిహెచ్‌సి డాక్టర్‌గా ఓంకార్‌నాద్‌

ప్రజాశక్తి – గణపవరం

గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర రెండవ డాక్టర్‌గా కమతం ఓంకార్‌ నాద్‌ శక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. నూతనంగా వచ్చిన డాక్టర్‌ ఓంకార్‌ నాద్‌కి ఆసుపత్రి డాక్టర్‌ పి.కిరణ్మయి, సిహెచ్‌ఒ జాలాది విల్సన్‌ బాబు, వైద్య సిబ్బంది పుష్పగుచ్చాలందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓంకార్‌ నాద్‌ మాట్లాడుతూ జిల్లా వైద్యాధికారి సూచనల ప్రకారం ఆసుపత్రికి వచ్చిన రోగులకు సేవలందిస్తానని చెప్పారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్‌ పోగ్రాంలో తనకి కేటాయించిన గ్రామాల్లో వైద్య సేవలందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌వి.పద్మజ, అప్తాల్మిక ఆఫీసర్‌ ఐ.శ్రీనివాస్‌, హెల్త్‌ అసిస్టెంట్‌లు యేహాన్‌, జి.శ్రీనివాస్‌, ధనంజయ, ఎం.నల్లయ్య పాల్గొన్నారు.

బాలింతలకు పండ్లు పంపిణీ

ప్రజాశక్తి – ఆచంట

ప్రతి ఒక్కరూ మానవతా ధృక్పథం కలిగి ఉండాలని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్‌ అన్నారు. శుక్రవారం ఆచంట వేమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పురుడు పోసుకున్న బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుష్ప రాజ్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సమాజంలో సాటివారికి సహాయపడేలా సేవా ధృక్పథం కలిగి ఉండాలని, పుట్టినరోజులు పేరు చెప్పి అనవసరం ఖర్చులు కన్నా పేదలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. పిల్లలకు చదువులతో పాటు సమాజంలో జరిగే కార్యక్రమాలపై తల్లిదండ్రులు అవగాహన కలిగించాలన్నారు. ముఖ్యంగా టెక్నాలజీ డెవలప్మెంట్‌ అవుతున్న రోజుల్లో కూడా కనీసం ఎదుటివారిని గౌరవించే స్థాయి తగ్గిపోతుందని, అలాగే మనం చదువుకున్న ఉపాధ్యాయులను గౌరవించేలా పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బంది పుట్టినరోజు జరుపుకుంటున్న సోని శ్వాస్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో నన్నేటి లక్ష్మీబాయి, అమల, కోలాటి జయశ్రీ, సత్యనారాయణ, ప్రసాదరావు, ప్రభుత్వాసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

టిడ్కో గృహాలు లబ్ధిదారులకు అందించాలి

సిపిఎం పట్టణ నాయకులు వైకుంఠరావు

ప్రజాశక్తి – భీమవరం

టిడ్కో ఇళ్ల నిర్మాణం వెంటనే పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాలని సిపిఎం పట్టణ నాయకులు ఎం.వైకుంఠరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 82 ఎకరాల్లో నిర్మాణం చేసిన టిడ్కో ఇళ్లు ఇంతవరకు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేస్తున్నా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానం అమలు చేయట్లేదన్నారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో సైకిల్‌ యాత్ర నిర్వహించి, కలెక్టరేట్‌ వద్ద వేలాది మందితో ధర్నా చేసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్‌ బిన్నీ శామ్యూల్‌

ఉండి : వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని యండగండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్‌ బిన్నీ శామ్యూల్‌ అన్నారు. శుక్రవారం ఉండి మండలం వెలివర్రు గ్రామంలోని గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంలో డాక్టర్‌ బిన్నీ శామ్యూల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బిన్నీ శామ్యూల్‌ మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఉదయం వేళల్లోను, సాయంత్రం వేళల్లోనూ ఎండ తీవ్రత లేని సమయంలో బయటికి వచ్చి పనులు చేసుకోవాలని తెలిపారు. ప్రతిఒక్కరూ డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఒఆర్‌ఎస్‌ ద్రావణం, కొబ్బరి నీళ్లు, సబ్జా, బార్లీ నీళ్లు వంటివి తీసుకోవాలని, శీతల పానీయాలకు దూరంగా ఉండాలని వారు సూచించారు. అనంతరం వృద్ధులకు, గర్భిణులకు, చిన్నారులకు వైద్యసేవలు అందించి, వారికి కావాల్సిన మందులను అందజేశారు.

ప్రభుత్వాసుపత్రిలో రక్తదానం

నరసాపురం : ప్రపంచ రెడ్‌క్రాస్‌ డే దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశాలను అనుసరించి కార్మిక శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని రెడ్‌ క్రాస్‌ సంస్థలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి నరసాపురం, పాలకొల్లు పట్టణంలోని వివిధ సంస్థలు, దుకాణాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, భవన నిర్మాణ కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి రెడ్‌ క్రాస్‌ సంస్థ ద్వారా సర్టిఫికెట్స్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ కంభంపాటి బిఆర్‌.శర్మ, రెడ్‌క్రాస్‌ సమన్వయకర్త ఎనుముల సతీష్‌ పాల్గొన్నారు.

ఎంపిడిఒగా ప్రభాకర్‌ రావు నియామకం

పెనుమంట్ర : పెనుమంట మండల పరిషత్‌ నూతన అభివృద్ధి అధికారిగా ఎంఎస్‌.ప్రభాకర్‌ రావు శుక్రవారం సాయంత్రం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన కాళ్ల మండల పరిషత్‌ పరిపాలన అధికారిగా విధులు నిర్వహిస్తూ ప్రమోషన్‌పై ఎంపిడిఒగా ఇక్కడికి వచ్చారు. ఇప్పటి వరకు అత్తిలి ఎంపిడిఒ శామ్యూల్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన ఎంపిడిఒ ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.

వక్ఫ్‌ బోర్డు భూముల పరిశీలన

మొగల్తూరు: మొగల్తూరులో వక్ఫ్‌ బోర్డుకు చెందిన సుమారు 4 ఎకరాల్లో ఇసుక అక్రమ తరలింపుపై అధికారులు విచారణ చేపట్టారు. ఆ భూముల్లో ఆక్వా సాగు చేసేందుకు గ్రామానికి చెందిన వ్యక్తి నాలుగేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకున్నారు. చెరువు తవ్వడంలో భాగంగా ఆ భూముల్లోని ఇసుక అక్రమంగా తరలించారు. దీనిపై ఆగ్రహించిన మైనార్టీ విభాగ ప్రభుత్వ సలహాదారు ఎంఎ షరీప్‌ తగుచర్యలు నిమిత్తం ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ సూపరింటెండెంట్‌ మూర్తి సిబ్బందితో కలిసి మొగల్తూరు వచ్చారు. చెరువు, ఇసుక తరలించిన ప్రాంతాలను గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

పోక్సో కేసులో నిందితుడి అరెస్టు

మొగల్తూరు : పోక్సోకేసులో నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశామని ఎస్‌ఐ జి.వాసు తెలిపారు. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముత్యాలపల్లి గ్రామానికి చెందిన చిక్కాల రాజు(21) ప్రేమపేరుతో బాలిక(17)ను వంచించాడు. దీనిపై ఆ బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో నిందితుడిని అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారని ఎస్‌ఐ తెలిపారు.

➡️