మంత్రి నిమ్మల
ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు వైద్య సహాయంగా సిఎం సహాయనిధి నుంచి రూ. 8.20 లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు జగన్ ప్రభుత్వ ఐదేళ్లలో కక్షలు, వేధింపులు, కేసులతో పేద వర్గాలకు వైద్యంను దూరం చేస్తే నేడు చంద్రబాబు మానవత్వంతో వైద్య సాయం అందిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు నెల రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చిందనే సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతులు ధాన్యంను నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే వెసులుబాటు తో పాటు 24 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది అన్నారు. జగన్ రైతులకు చెల్లించాల్సిన 1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను ఎగ్గొడితే చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది అన్నారు. రైతులు, వ్యవసాయం ను గాలికి వదిలేసి ధాన్యం సేకరించే సివిల్ సప్లై కార్పొరేషన్ ను సైతం తాకట్టు పెట్టిన రైతుల ద్రోహి జగన్ అన్నారు. రైతులను దగా మోసం అబద్దాలాడిన జగన్, వైసిపి నాయకులకు రైతులు, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదు అన్నారు. గత వైసిపి ఐదేళ్ల పాలనలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అనేక అవస్థలకు గురయ్యారన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ను కొనుగోలు చేసి రైతులను చంద్రబాబు అన్ని విధాల ఆదుకుంటున్నారు అన్నారు.తొలిసారి కౌలు రైతులకు ఈ క్రాప్ నమోదు సౌకర్యం కల్పించింది చంద్రబాబు అన్నారు. గత అయిదేళ్ళలో రైతులు,అధికారులతో మాట్లాడి తమ సమస్యలు చెప్పుకునే పరిస్దితి లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక అధికారులనే రైతుల దగ్గరకు పంపుతోంది అన్నారు.