ప్రజాశక్తి – ఆకివీడు
ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గీతాబాయి సూచించారు. వయసు రీత్యా వారు వచ్చిన వెంటనే వైద్య సహాయం అందించి ముందే పంపించాలని తెలిపారు. స్థానిక లయన్స్ హాల్లో సోమవారం సర్ ఆర్దర్ కాటన్ వృద్ధుల సంక్షేమ సంఘం, లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్ కె.జానకమ్మ సంస్మరణార్థం వృద్ధుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు లయన్స్ అంతర్జాతీయ సభ్యులు, వృద్ధుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఎంవి.సూర్యనారాయణరావు అధ్యక్షత వహించారు. సదస్సులో జిల్లా వైద్యాధికారి గీతాభారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ముందు అవకాశం ఇవ్వాలని, వైద్యులకు అధికారులకు చాలా స్పష్టంగా తెలియజేశామని చెప్పారు. వృద్ధుల, వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా సహాయ సంచాలకులు బి.రామ్ కుమార్ మాట్లాడుతూ వృద్ధులు గుర్తింపు కార్డు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వృద్ధుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బొబ్బలి బంగారయ్య సంఘం ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. స్థానిక వైద్యులు డాక్టర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ కవిత, డాక్టర్ మాధవి, డాక్టర్ బిలాల్ పాల్గొన్నారు. అనంతరం సుమారు 100 మంది వృద్ధులకు దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.