లూథరన్ హైస్కూల్ విద్యార్థులకు కంచాలు, గ్లాసులు అందజేత
ప్రజాశక్తి – భీమవరం టౌన్
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రతిఒక్కరూ స్టీల్ గ్లాస్లు, ప్లేట్స్ మాత్రమే వాడాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ రీజనల్ మేనేజర్లు వెంకన్న బాబు, రామకృష్ణ అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో భీమవరం లూథరన్ హైస్కూల్లోని 120 మంది విద్యార్థులకు దాతల సహకారంతో 120 స్టీల్ గ్లాస్లు, 120 కంచాలను సోమవారం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, 10 రోజులుగా పట్టణంలో ప్లాస్టిక్ నిషేదం జరుగుతుందని, ప్రజల్లో కూడా మార్పు రావాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. పట్టణానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు కోటిపల్లి సాయి పార్ధసారధి సహకారంతో 120 స్టీల్ గ్లాస్, 120 కంచాలను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం మణి రాజు, పిఇటి ప్రసన్న, కొడపల్లి నాగరాజు పాల్గొన్నారు.