పద్మశ్రీ అవార్డు పొందడం గర్వకారణం : ఎంఎల్‌ఎ

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం

స్థానిక 2వ వార్డు వీకర్స్‌ కాలనీకి చెందిన కీర్తిశేషులు మిరియాల అప్పారావు పద్మశ్రీ అవార్డును కైవసం చేసుకోవడం నియోజకవర్గానికి గర్వకారణమని తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మిరియాల అప్పారావు వారసురాలు ఎడవల్లి శ్రీదేవిని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ కీర్తి పతాకాలను ఎగురవేసిన బుర్రకథ కళాకారులు మిరియాల అప్పారావు తమ నియోజకవర్గ కాపురస్తులు కావడం తాడేపల్లిగూడెం ప్రజల అదృష్టంగా అభివర్ణించారు. బుర్రకథ కళాకారుడిగా 2025 పద్మశ్రీ అవార్డు గ్రహీత భారత అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడానికి ఆయన ఈరోజు లేకపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతగా ఎన్నికైన వారు అకాల మృతిచెందడంతో వారి కుమార్తె శ్రీదేవి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపతిముర్ము చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ఎంఎల్‌ఎ బొలిశెట్టి శ్రీనివాస్‌ అభినందనలు తెలియజేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య : డివైఇఒ

ప్రజాశక్తి – పెనుమంట్ర

నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా లభ్యమవుతాయని నరసాపురం డివైఇఒ డి.మురళీసత్యనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని విద్యాశాఖకు చెందిన పలు విభాగాలను ఆయన తనిఖీ, పర్యవేక్షించారు. మండల విద్యాశాఖాధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఉచిత సదుపాయాల గురించి వివరిస్తూ మండలకేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ప్రయివేట్‌ పాఠశాలలకు దీటుగా క్వాలిఫైడ్‌ టీచర్‌లతో నాణ్యమైన విద్య, అన్ని మౌలిక సదుపాయాలు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం పెనుమంట్ర హైస్కూల్‌లో జరుగుతున్న 10వ తరగతి విద్యార్థుల తరగతులను నరసాపురం డివైఇఒ డి.మురళీసత్యనారాయణ పరిశీలించి, 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలు పాసవ్వటానికి అవసరమైన మార్కుల సాధనకు సలహాలు, సూచనలు విద్యార్థులకు అందించారు. పెనుమంట్ర హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్టాక్‌ పాయింట్‌ను ఆయన పరిశీలించారు. స్టాక్‌ పాయింట్‌ను సమర్థవంతంగా నిర్వహణకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఎంఇఒలు వై.లక్ష్మీనారాయణ, యు.నాగేశ్వరరావు, హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు డి.శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️