ఎపి కౌలురైతుల సంఘం ఆధ్వర్యాన ఆందోళన
ప్రజాశక్తి – పోడూరు
కౌలురైతుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతన కౌలురైతుల చట్టాన్ని వెంటనే అసెంబ్లీలో పెట్టి ఆమోదించాలని ఎపి కౌలురైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు డిమాండ్ చేశారు. కొత్త చట్టం వెంటనే తీసుకురావాలని కోరుతూ గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు భూయజమానుల సంతకంతో సంబంధం లేకుండా కౌలురైతులకు ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంటనమోదు కౌలురైతుల పేరున చేసి పంటరుణాలు, నష్ట పరిహారం కౌలురైతులకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యాన సంతకాలు సేకరించి సిఎంకు పంపాలని స్థానిక తహశీల్దార్లకు అందజేస్తున్నామన్నారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ కెవివి.సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు పంపన నాగరాజు, కౌలురైతులు బండి శ్రీనివాస్, ఇంజేటి శేఖర్, బూరాడి శ్రీనివాసరావు, కోట ఠాగూర్, సరెళ్ల ఇజ్రాయేలు, ఉండ్రు రంగారావు, నక్కా శ్యామ్సుందరం, కుసుమే రమేష్, ఇంజేటి రాజేష్ పాల్గొన్నారు.