బీచ్‌లో గల్లంతైన యువకుని ఆచూకీ లభ్యం

మొగల్తూరు : మండలంలోని పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుని ఆచూకీ శనివారం లభ్యమైంది. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ జి.వాసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ద్వారకాతిరుమల గ్రామానికి చెందిన పదిమంది యువకులు ఆటోపై శుక్రవారం పేరుపాలెం బీచ్‌కు తరలివచ్చారు. సముద్రపు అలలో స్నానం చేస్తూ బర్మావతుల లాలు(17) ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యాడు. లాలు కోసం గాలిస్తూ ఉండగా మొళ్లపర్రు తీరంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

తాతరాజు కుటుంబ సభ్యులకు పరామర్శ

భీమవరం టౌన్‌ : భీమవరం జనసేన నాయకులు, మాజీ కౌన్సిలర్‌ గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు(తాతరాజు) కుటుంబ సభ్యులను శనివారం రాష్ట్ర పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌, ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు) పరామర్శించారు. ఒక ఆత్మీయుడిని కోల్పోయామని, ఆయన భౌతికంగా లేకపోయినా అందరి మధ్యలో ఎప్పటికీ ఉంటారని అన్నారు. తాతరాజు జనసేనకి అందించిన సేవలు ఎనలేనివని, ఆయన లేకపోవడం తీరని లోటని ఆయనకు నివాళులర్పించారు. టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి, పొత్తూరి బాపిరాజు కుటుంబ సభ్యులున్నారు.

28 నుంచి వేసవి విజ్ఞాన శిబిరం

గణపవరం : పిప్పర గ్రంథాలయంలో ఈనెల 28 నుంచి విద్యార్థులకు వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గ్రంథపాలకుల పి.రంగారావు శనివారం తెలిపారు. శిబిరాన్ని జూన్‌ 6వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శిబిరంలో విద్యార్థులకు పుస్తక పఠనం, చిత్రలేఖనం, పేపర్‌ ఆర్ట్‌ డాన్సులు వంటి కార్యక్రమాలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వేసవి శిబిరంలోకి పంపి వారి అభివృద్ధికి సహకరించాలని కోరారు.

సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలి

తాడేపల్లిగూడెం : మేలో జరిగే సప్లిమెంటరీ పరీక్షల నిమిత్తం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను డిఇఒ నారాయణ పరిశీలించి, ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. అదేవిదంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలకు ఆహ్వానం, ప్రభుత్వ పథకాలు, పాఠశాలలో సౌకర్యాలు వివరిస్తూ విద్యాశాఖ ద్వారా తయారుచేయబడిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డివైఇఒ శ్రీనివాసరావు, ఎంఇఒ వి.హనుమ, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఫిష్‌ మార్కెట్‌ పరిశీలన

నరసాపురం: పట్టణంలోని ఫిష్‌ మార్కెట్‌ను శనివారం నరసాపురం మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.అంజయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిష్‌ మార్కెట్‌ శుభ్రంచేసే పారిశుధ్య కార్మికులు పలు సూచనలు చేశారు. మురుగు సమస్యలు లేకుండా ప్రతి రోజు ఫిష్‌ మార్కెట్‌ డ్రెయినేజీ శుభ్రం చేసే పనులను చేపట్టాలన్నారు. మురుగు నీరు లేకుండా చేయడం వల్ల దోమల సమస్య రాదని, ప్రజలు అంటురోగాల భారిన పడకుండా ఉంటారని తెలిపారు. మార్కెట్‌ డ్రెయినేజీలలో చెత్తాచెదారం కాగితాలు, ప్లాస్టిక్‌ కవర్లు వేయకుండా ఉండాల్సిన బాధ్యత ఫిష్‌ మార్కెట్‌ వ్యాపారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్‌ వేండ్ర ప్రసాద్‌ పాత్రుడు, సానిటరీ మేస్త్రి కిషోర్‌ పాల్గొన్నారు.

మేథోసంపత్తి హక్కులపై జాతీయస్థాయి కార్యశాల

పాలకొల్లు : స్థానిక శ్రీఅద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ అటానమస్‌ కళాశాలలో ప్రపంచ మేధో సంపత్తి హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రసాయన శాస్త్ర విభాగం, ఐక్యు ఎసి ఇన్సిట్యూషన్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ విభాగాల ఆధ్వర్యంలో మేథోసంపత్తి హక్కులపై జాతీయస్థాయి కార్యశాల నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం సభా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఫ్యాకల్టీ, రీసెర్చ్‌ స్కాలర్స్‌, విద్యార్థులకు సంపూర్ణ అవగాహన ఇస్తుందని తెలియజేశారు. ఆవిష్కరణలకు పరిరక్షణ, హక్కులు కలిగి ఉండాలంటే తప్పకుండా మేధో సంపత్తి హక్కులు పొందాలని, రీసెర్చ్‌ విద్యార్థులు అధ్యాపకులు వీటిపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ టి.కృష్ణ, ఐక్యూఎసి కోఆర్డినేటర్‌ కె.భద్రాచలం, పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌వి.రంగారావు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️