ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం
33/11 కెవి విద్యుత్ సబ్స్టేషన్ పాతూరు పరిధిలో ఉన్న విద్యుత్ లైన్ల మరమ్మతుల నిమిత్తం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నరసింహమూర్తి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మహాలక్ష్మినగర్, పిఅండ్టి కాలనీ ఫీడర్లకు సంబంధించిన డిఎస్ చెరువు ఏరియా, జాన్సీరాణి హాస్పిటల్ ఏరియా, పంపు హౌస్, మహాలక్ష్మి నగర్, సత్యవతి నగర్, చెట్ల రోడ్, టిటిడి కల్యాణమండపం రోడ్లలోని పట్టణ వినియోగదారులు సహకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
రేషన్ బియ్యం పట్టివేత
ప్రజాశక్తి – పెనుగొండ
మండలంలోని సిద్ధాంతం జంక్షన్ వద్ద వాహనం ఆపి, విజిలెన్సు, రెవెన్యూ, పౌర సరఫరా అధికారులు తనిఖీ చేయగా 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించామని రీజినల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారి వి.శ్రీరాంబాబు అన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం వారి ఆదేశాల మేరకు గుర్తించి వాహనం యజమాని, డ్రైవర్ కోర్లేపర్ల మణికంఠను ప్రశ్నించగా ఆ బియ్యం తణుకు పరిసర ప్రాంతాలలో తక్కువ ధరకు కొనుగోలు చేసి తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్తునట్లు తెలిపారు. ఈ తనిఖీలో రూ.లక్ష 40 వేలు విలువ కలిగిన బియ్యం రూ.5,85,837లు విలువ కలిగిన వాహనం వెరసి మొత్తం రు.7,25,837లు విలువ కలిగిన సొత్తును సీజ్ చేసి కోర్లేపర్ల మణికంట, తూర్పుగోదావరికి చెందిన ఎన్వి.రామకృష్ణ, ఉండమట్ల మణికంటలపై నిత్యవసరవస్తువుల చట్టం 1955 ప్రకారం వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో విజిలెన్సు సిఐపి శివరామకృష్ణ, పెనుగొండ సిఎస్ఆర్ఐ సత్యనారాయణ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ధనుంజయరెడ్డి ఇంట్లో సోదాలు దారుణం
తహశీల్దార్ కార్యాలయం వద్ద మీడియ ప్రతినిధుల నిరసన
ప్రజాశక్తి – ఆకివీడు
తెలుగు దినపత్రిక సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి నివాసంలో అక్రమంగా పోలీసులు సోదాలు నిర్వహించడం దారుణమని విలేఖరి కోటేశ్వరరావు అన్నారు. అక్రమ సోదాలను నిరసిస్తూ గురువారం స్థానిక పాత్రికేయులు, ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రతినిధులు తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కొద్దిసేపు నిరసన నినాదాలు చేశారు. అనంతరం తహశీల్దార్ నండూరి వెంకటేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ దాడులు ప్రజాస్వామ్యాన్ని, పత్రికా రంగాన్నీ అవమానపరచడమేనని, పత్రికస్వేచ్ఛను హరించడమేనని పాత్రికేయులు పేర్కొన్నారు. ఈ రకమైన విధానం ఎంత మాత్రం సరికాదని, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి నాయకులు అంబటి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి విలేకరి వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్స్ మీడియా ప్రతినిధులు శ్రీనివాసు, చింత ఆదిశేషు, ఎన్.సర్కార్, పాత్రికేయులు పాల్గొన్నారు.
కొనసాగిన వేసవి విజ్ఞాన తరగతులు
ప్రజాశక్తి – నరసాపురం
ప్రథమ శ్రేణి శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులలో భాగంగా గురువారం కథలు గురించి వివరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జీవిత చరిత్ర, తాతయ్య కథలు, నీతి కథలు, జంతు ప్రపంచం, పరమానంద శిష్యులు మొదలైనవి చదివించడం నాకిష్టం కార్యక్రమం జరిగింది. రిసోర్స్ పర్సన్ శాస్త్రవేత్త సుబ్బారావు పాల్గొని ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ డే సందర్భంగా రెడ్ క్రాస్ గురించి పిల్లలకు వివరించారు. 1864 మే 8న రెడ్ క్రాస్ సంస్థ స్థాపించబడింది. దేశ విదేశాల్లో రెడ్ క్రాస్ సేవలు వినియోగించబడుతున్నాయి. ముఖ్యంగా మానవతవాదాన్ని, మానవుల జీవితాలను, ఆరోగ్యాలను కాపాడటానికి ప్రథమ చికిత్స, వైద్యశాలలు స్థాపించడం, రక్తం సేకరించడం మొదలైన సేవలు నిర్వహిస్తారని తెలియజేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం సందర్భంగా వారి జీవిత చరిత్ర గురించి వివరించారు. సిహెచ్ శ్రీనివాస్ స్కూల్ అసిస్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహించారు. ఇంగ్లీష్ భాష ఉచ్చరణ, సిలబుల్స్, వకాబులరీ గురించి విపులంగా వివరించారు. చిత్రలేఖనంలో బేసిక్స్ గురించి, వేమన పద్య శతకాలు వివరించారు. రిసోర్స్ పర్సన్ రావి కృపారావు పాల్గొని పిల్లలకు గుడ్ హ్యాండ్ రైటింగ్లో శిక్షణ ఇచ్చారు. డాక్టర్ చినమిల్లి శ్రీనివాస్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి పిల్లలకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని గ్రేడ్ వన్ లైబ్రేరియన్ కెజెఎస్ఎల్.కుమారి పర్యవేక్షించారు.
పెనుమంట్ర : ఇంటా బయటా పెద్దలను గౌరవించడం గురించి ఇంటి నుంచే పిల్లలు తెలుసుకోవాలని విశ్రాంత ఉపాధ్యాయిని పి.సువర్ణ గౌరి అన్నారు. గురువారం మార్టేరు శాఖా గ్రంథాలయంలో జరిగిన వేసవి విజ్ఞాన శిబిరంలో పిల్లలకు యోగ తదితర అంశాలు బోధించారు. ఎల్వి సూర్యనారాయణ మూర్తి జనరల్ నాలెడ్జ్ మీద పిల్లలకు అవగాహన కల్పించి వివిధ ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబట్టారు. ఈ వేసవి శిక్షణా శిబిరంలో యస్. జశ్వంత్, ఎస్.రామచరణ్, టి.రఘునందన్, టి.కార్తికేయ రెడ్డి, ఎస్.ప్రణవ్, కె.తనూష, డి.జయంత్ నీలారెడ్డి, పి.నాగశ్రీ రామిరెడ్డి, టి.హసిని, కె.దీక్షిత, లక్ష్మి ప్రసన్న, బి.ఆశ సరయు, గ్రంథాలయాధికారి పిటిఎస్.కూమార్, కె.రామిరెడ్డి పాల్గొన్నారు.