ప్రజాశక్తి – పాలకొల్లు
పాలకొల్లులో ఉద యం ఎండ, మబ్బులు దోబూచులాడాయి. అయితే మధ్యాహ్నం నుంచి ఎండతీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో పాలకొల్లు పట్టణంలోని శనివారపు సంత కొనుగోలుదారులు లేక నిర్మానుష్యంగా ఉంది. గత కొన్ని వారాలుగా ఇదే పరిస్థితి ఉంది. కొందరు వ్యాపారులు కూడా ఎండకు భయపడి దుకాణాలు వేయడం మానేశారు. వేసిన దుకాణాల్లో కొనుగోలుదారులు లేక వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. వారపు సంతలో రేట్లు అనుకూలంగా ఉన్నా ఎండకు భయపడి మధ్యతరగతి ప్రజలు సంతకు రావడం మానేసారు.
రోడ్డు పనులు తెలుపుతూ ఆర్అండ్బి బ్యానర్
ప్రజాశక్తి వార్తకు స్పందన
ప్రజాశక్తి – పెనుమంట్ర
మార్టేరు-పెను గొండ రోడ్డు మార్గంలో నెగ్గిపూడి వద్ద జరుగుతున్న కల్వర్ట్ నిర్మాణపు పనుల నిమిత్తం రోడ్డు మూసివేస్తున్నట్టు ఆర్అండ్బి అధికారులు బ్యానర్ని నెలకొల్పారు. ఈ మేరకు ఆర్అండ్బి ఎఇ ప్రసాద్ మాట్లాడుతూ మార్టేరు సెంటర్లోను, పెనుగొండ వంతెన రోడ్డు సమీపంలోని బస్ స్టాండ్ వద్ద, కాలేజీ వంతెన వద్ద దారి మళ్లింపు సమాచారం తెలిపే బ్యానర్లు పెట్టినట్టు పేర్కొన్నారు. నెగ్గిపూడి వద్ద నిర్మాణం జరుగుతున్న కల్వర్ట్ వద్ద ద్విచక్ర వాహనాల రాకపోకలు సాగించడం కోసం కాల్వ పైన మట్టితో ర్యాంపు నిర్మాణం చేసామని, ఎవరికీ ఇబ్బంది ఉండదని అన్నారు. జూన్ 10 నాటికి నెగ్గిపూడి కల్వర్ట్ నిర్మాణం, పెనుగొండ పెద్ద వంతెన రిపేర్ పనులు పూర్తిచేసి పూర్తిగా అన్ని వాహనాలు తిరగడానికి అందుబాటులోకి తీసుకొని వస్తామని అన్నారు.
వీర సైనికుల త్యాగానికి సంఘటితం కావాలి
వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిశోర్ కుమార్
ప్రజాశక్తి – ఆచంట
సరిహద్దుల్లో అసువులు బాసిన వీర సైనికుల త్యాగానికి ప్రతిఒక్కరూ సంఘటితం కావాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిశోర్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక వైసిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉగ్రవాద మూకలపై భారత సైన్యం వీరొచిత పోరాటం చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి పార్టీలు, వర్గాలు, ప్రదేశాలు అన్ని వదిలేసి ఒక్క భారతీయతే లక్ష్యంగా ప్రతి ఒక్క పౌరుడు నిలబడాలని పిలుపునిచ్చారు. సరిహద్దుల్లో భారత సైన్యం ప్రాణాలొడ్డి పోరాడుతుందన్నారు. ఇప్పటికే ఇద్దరు వీర జవానులు వీర మరణం పొందారన్నారు. వారి త్యాగానికి గుర్తుగా అందరం సంఘటితం కావాలన్నారు. పార్టీలకతీతంగా భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడదామన్నారు. భారతీయతే మన ఎజెండా అని అన్నారు. ప్రతి ఒక్కరి భావనలో భారతదేశ మువ్వన్నెల జెండాను తలుచుకుంటూ తరతరాల ఉగ్రవాద ముష్కరులపై జై భారతమాత అంటూ ఏకకంఠంతో నినదిద్దాం అని పిలుపునిచ్చారు.నేడు సమతా ట్రస్ట్ పురస్కారాల వేడుకప్రజాశక్తి – పెనుమంట్ర మండలంలోని పొలమూరు గ్రామంలో సమతా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం సాయంత్రం ఇటీవల టెన్త్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు తెచ్చుకున్న 11 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నామని ట్రస్ట్ ఫౌండర్, అధ్యక్షులు తాడిపర్తి సంపత్ రావు ఇక్కడ తెలిపారు. ఈ ప్రతిభా పురస్కార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికా శాఖ జాయింట్ డైరెక్టర్ దిద్దే శ్రీనివాసరావు, రాజమండ్రి ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య గోడి సుధాకర్, పొలమూరు సర్పంచి కాకర రాజేశ్వరరావు, ట్రస్ట్ సభ్యులు చింతపల్లి రామకృష్ణ, డాక్టర్ ఉన్నమట్ల మునిబాబు పాల్గొంటారని ఆయన తెలిపారు.
వైసిపి మహిళా నేత సరిత ఔదార్యం
ప్రజాశక్తి – పాలకొల్లు
పాలకొల్లు పట్టణంలో కోర్టు పక్కన టీ కొట్టు పెట్టుకుని జీవనోపాధి పొందుతున్న ఈశ్వరమ్మ, రమణమ్మలు తల్లి కూతుర్లిద్దరి టీ వ్యాపారం పెట్టుబడి లేక నిలిచిపోయింది. ఆ వ్యాపార, తల్లి కూతుర్ల ఆర్థిక పరిస్థితి గురించి ప్రముఖ అడ్వకేట్ జివి.సుబ్బారావు వైసిపి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరితకు తెలియజేశారు. దీంతో ఆమె రూ.5 వేల ఆర్ధిక సహకారం వారికి అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు జోగాడ ఉమామహేశ్వరరావు, పార్టీ మున్సిపల్ విభాగం అధ్యక్షులు జోగి వెంకటేశ్వరరావు, మామిడిశెట్టి చిట్టిబాబు, దేవ రాజేష్, వీరా మల్లికార్జునుడు, గుమ్మాపు సూర్య వరప్రసాద్, కుమారి, జ్యోతి పాల్గొన్నారు.
వెబ్ డెవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ
ప్రజాశక్తి – పాలకొల్లు
స్థానిక శ్రీదాసరి నారాయణరావు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వెబ్ డెవలపర్ కోర్సు 3 నెలలు ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందని ప్రిన్సిపల్ డాక్టర్ శోభారాణి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రాఫిక్ డిజైన్ అసోసియేట్ కోర్సులో 2 నెలల ఉచిత శిక్షణ ఇవ్వబడుతుందని ప్రిన్సిపల్ అన్నారు. ఇంటర్, డిగ్రీ పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆసక్తి గలవారు 8309208484 నెంబర్ను సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.
నాటుసారా నిర్మూలనపై అవగాహన
తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0 శనివారం తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని లింగరాయుడుగూడెం గ్రామంలో నిర్వహించారు. మద్యపాన వ్యసనం – వ్యసన విముక్తికు కేర్ కమిటీచే అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాటుసారాయి, మద్యపాన సేవనం, ఆ వ్యసనంలో చిక్కుకుని అనారోగ్యం బారినపడిన వారిని గుర్తించి, ప్రభుత్వంచే నిర్వహించబడుతున్న వ్యసన విముక్తి కేంద్రంలో చేర్పించే విధంగా వారికి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ స్వరాజ్ లక్ష్మి మాట్లాడుతూ ప్రజలందరూ మద్యపానానికి గురికాకుండా ఆరోగ్యవంతంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఆర్.దొరబాబు, హెడ్ కానిస్టేబుళ్లు విప్లవకుమార్, అనిల్ కుమార్, సిబ్బంది, గ్రామ ఉప సర్పంచి కాసాని రాంబాబు, ఎంపిటిసి వీరమల్లు వెంకన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.
తణుకురూరల్ : మద్యం సేవించడం వల్ల కలిగే స్వల్పకాలిక, దీర్ఘకాలిక అనారోగ్య ప్రభావాలపై కేర్ కమిటీ(కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో స్థానిక సుధా హాస్పిటల్లో తణుకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ ఎస్.మణికంఠరెడ్డి మాట్లాడుతూ మద్యం సేవించడం వల్ల మానవ శరీరంలో వివిధ అవయవాలు గొంతు, అన్నవాహిక, కాలేయం, పెద్ద పేగులు, గుండె తదితర అవయవాలపై చూపే దుష్ప్రభావాలు, మానసిక ఆందోళన, డిప్రెషన్, అధిక రక్తపోటు తదితర లక్షణాలు మద్యపానం వల్ల కలుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సుధా హాస్పిటల్ డాక్టర్ రవిశంకర్, ఎస్ఐలు బి.లక్ష్మీ, ఆర్.మధుబాబు పాల్గొన్నారు.
గోల్ట్ లోన్ అవకతవకలపై కేసు నమోదు
నరసాపురం : పట్టణంలోని ముత్తూట్ మినీ ఫైనల్స్ బ్యాంకు గోల్ట్ లోన్లో అవకతవకలపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ సిహెచ్.జయలక్ష్మి తెలిపారు. స్టీమర్ రోడ్లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్లో పట్టణానికి చెందిన యర్రగుంట శంకర సుబ్బారావు మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు పోతుల వంశీకృష్ణ, కొపనాతి సౌజన్య, రాజమిల్లి శ్రీహర్ష కలిసి బ్యాంకులో లోన్ పెట్టిన 22 రుణాలకు సంబంధించి 718 గ్రాముల బంగారం అవకతవకలు జరిగినట్లు ఫిబ్రవరి 25న జరిగిన ఆడిట్లో బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. దీనిపై ఉన్నతాధికారులు గడువు ఇవ్వగా 11 రుణాలకు సంబంధించి లావాదేవీలు సరిచేసారు. మిగిలిన 11 లావాదేవీలకు సంబంధించిన 485 గ్రాముల విలువైన బంగారంకు రూ.16,93,196 నగదు తిరిగి సంస్థకు చెల్లించలేదన్నారు. దీంతో ఆ సంస్థ రిజనల్ మేనేజర్ వేల్పూరి రాజేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జయలక్ష్మి తెలిపారు.