కాళ్ల : చిత్తడి నేలలు ప్రకృతి పరిరక్షణకు నెలవులని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి ఉపాధ్యక్షులు మంతెన వెంకట రవివర్మ అన్నారు. శనివారం ఆయన ఏలూరుపాడులో విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ఆటపాకనందు ఉన్నటువంటి కొల్లేరు పక్షుల అభయారణ్యంలో చిత్తడి నేలల ప్రాముఖ్యత, కొల్లేరు సరస్సు అభివృద్ధి సమితి, స్పేస్ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. చిత్తడి నేలలు అనేక జీవరాసుల మనగడతోపాటు మానవుల మనుగడకు, పర్యావరణ పరిరక్షణకై ఎంతో అవసరమన్నారు. స్పేస్ సంస్థ ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీకృష్ణారావు మాట్లాడుతూ చిత్తడి నేలలు నీటిని శుభ్రపరచడంతో పాటు, భూగర్భ జలాలను పెంచటంతో పాటు, వరదల తీవ్రతను తగ్గిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మంతెన హిమ, రామాయణం సతీష్, ఆకుల తేజ పాల్గొన్నారు.
