మీరు చెప్పిందే జెఎసి కోరుతోంది..

Apr 23,2025 23:59

మాట్లాడుతున్న భారవి, ఇతర నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు :
శంకర్‌ విలాస్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జికి సంబంధించి జెఎసి కొత్తగా ఏమీ కోరట్లేదని గతంలో ప్రభుత్వం ప్రకటించిన డిజైన్‌ ప్రకారమే ఫ్లైఓవర్‌ నిర్మించాలని కోరుతున్నామని బెటర్‌ శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్‌ సాధన సమితి నాయకులు కోరారు. బుధవారం అరండల్‌పేటలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెఎసి నాయకులు ఎల్‌.ఎస్‌.భారవి, పి.వి.మల్లికార్జునరావు మాట్లాడుతూ గతంలో గల్లా జయదేవ్‌ ఎంపిగా ఉన్నప్పుడు, తాజాగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక కూడా ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మిస్తామని, అండర్‌ బ్రిడ్జి కూడా ఉంటుందని ప్రకటించారని గుర్తు చేశారు. తీరా డిజైన్‌ చూశాక యూటర్న్‌ తీసుకున్నారన్నారు. బ్రిడ్జి పొడవును 930 మీటర్లకు కుదించి, ఆర్‌యుబి కూడా లేదని చెబుతున్నారన్నారు. మొదట ప్రకటించిన ఒరిజినల్‌ డిజైన్‌ ప్రకారం హిందూ కాలేజి కూడలి నుండి లాడ్జి సెంటర్‌ వరకూ ఐకానిక్‌ ఫ్లైఓవర్‌ నిర్మించాలని, ఆర్‌యుబి నిర్మించాలని, సర్వీసు రోడ్లు కనీసం 30 అడుగుల వెడల్పుతో ఉండాలని జెఎసి కోరుతున్నట్లు చెప్పారు. బ్రిడ్జి పొడవు కుదించటం, అండర్‌ బ్రిడ్జి నిర్మించకపోవటం వల్ల ఎదురయ్యే సమస్యలను జెఎసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుందన్నారు. రూరల్‌ ప్రాంతాల్లో రైల్వే లెవల్‌ క్రాసింగ్స్‌ వద్ద ఆర్‌ఓబిలు, ఆర్‌యుబిల నిర్మాణం కోసం ఉద్దేశించిన సేతబందన్‌ పథకాన్ని గుంటూరు నగరంలో, ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ ఉండే ప్రాంతంలో మంజూరు చేయించి, రూ.98 కోట్లతేనే ఎంత పొడవు వస్తే అంతే బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పటం సరికాదన్నారు. జెఎసికి దురుద్దేశాలు ఆపాదించటం సరికాదన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఆస్తి పన్ను పెంపుదలకు వ్యతిరేకంగా జెఎసిలోని ఇవే సంఘాలు ప్రజల తరపున పెద్ద ఎత్తున పోరాడాయని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ప్రజల కోసమే జెఎసి డిజైన్‌లో సవరణలు కోరుతోందన్నారు. నగరంలోని 11 లక్షల జనాభా సౌకర్యార్థం బ్రిడ్జి డిజైన్‌లో సవరణలు కోరుతున్నామని, ఫ్లైఓవర్‌కు వ్యతిరేకం కాదని, కచ్చితంగా నిర్మించాలనే చెబుతున్నామని అన్నారు. నిధులు సరిపోకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అదనపు నిధులు సమీకరించి ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించాలని, ఆర్‌యుబి కూడా నిర్మించాలని కోరారు. సమావేశంలో అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, జెఎసి నాయకులు వెంకట్రావు పాల్గొన్నారు.

➡️