ప్రజాశక్తి-రేపల్లె: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్.మణిలాల్ కోరారు. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం రేపల్లె మున్సిపల్ ఆఫీస్ వద్ద విరామ సమయంలో ధర్నా నిర్వహించి కమిషనర్ కె.సాంబశివ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లా డుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలలో ఇంజనీరింగ్ విభాగాలైన వాటర్ సప్లై స్ట్రీట్ లైటింగ్ టౌన్ ప్లానింగ్, ఫిట్టర్, మెకానిక్, డ్రైవర్, టర్న్ కాక్, ఫంచరింగ్ వెల్డర్, పెయింటర్, గార్డినర్, కంప్యూటర్ ఆపరేటర్, వెటర్నరీ, సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్స్ తదితర విభాగాలకు చెందిన సుమారు 13 వేల మంది కార్మికులు 25 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రమాదకరమైన పనులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ చెల్లించాలని, పనిచేసేందుకు అవసరమైన పనిముట్లు, కిట్లు, సకాలంలో అందించాలని కోరారు. చట్టబద్ధమైన వారాంతపు, క్యాజువల్, జాతీయ సెలవులు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లె మున్సిపల్ ఇంజ నీరింగ్ కార్మికుల యూనియన్ అధ్యక్షులు డి.ప్రభాకర రావు, కార్యదర్శి ఎన్.రవిబాబు, శివ, రవి, రాఘవేంద్ర రావు, రమేష్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.
