కూలీలకు సౌకర్యాలు కల్పించాలి

ప్రజాశక్తి- టంగుటూరు : ఉపాధి కూలీలకు యావరేజ్‌ కూలి పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎ. తమీమ్‌ అన్సారియా డ్వామా అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని జయవరం గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న సాగునీటి కాలువలో పూడిక తీత పనులను కలెక్టర్‌ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేసిన పనులకు సకాలంలో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయా లేదా అని ఆరా తీశారు. కూలీల హాజరు, పని ప్రదేశంలో తాగు నీరు, నీడషెడ్‌ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుని పని చేయాలని తెలిపారు. ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా మేడపల్లి రాజమ్మ అనే మహిళ కూలి తాను వితంతువు పెన్షనుకు అర్హులని, అయినప్పటికీ రావడం లేదని, పెన్షన్‌ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్‌ మాట్లాడుతూ రాజమ్మకు వితంతువు పెన్షను మంజూరుకు తగు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ దేవసేన కుమారిని ఆదేశించారు. అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుంచి తన భర్తకు ఆరోగ్యం బాగాలేక మంచంలోనే ఉన్నాడని, తను కుమారుడు కూడా మరణించాడని తనకు పెన్షను మంజూరు చేయాలని యరజర్ల భారతమ్మ కలెక్టర్‌ను కోరారు. దీంతో స్పందించిన కలెక్టర్‌ మాట్లాడుతూ భారతమ్మకు పెన్షను చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒను ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన పశువుల నీటి తొట్టిని కలెక్టర్‌ ప్రారంభించారు. అదేవిధంగా ఎరమోసు సుధాకర్‌ పొలంలో నిర్మిస్తున్న ఫారం పాండ్‌ను కలెక్టర్‌ పరిశీలించి వివరాలను అడిగి తెలుసు కున్నారు. యల్లవరపు వెంకట సుబ్బారెడ్డి ఇంటి పై పిఎం సూర్యఘర్‌ పథకం ద్వారా ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెల్‌ను కలెక్టర్‌ పరిశీలించారు.కలెక్టర్‌ వెంట డ్వామా పీడీ జోసెఫ్‌ కుమార్‌, తహశీల్దారు ఆంజనేయులు, గ్రామ సర్పంచి పేరమ్మ, విద్యుత్‌ శాఖ ఇఇ హరిబాబు, ఎంపిడిఒ ఆర్‌. దేవసేన తదితరులు పాల్గొన్నారు.

➡️