ప్రజాశక్తి – పులివెందుల రూరల్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడు డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అనారోగ్య కారణంగా శుక్రవారం మృతి చెందాడు. ఈయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికాయాన్ని పులివెందులలోని ఆయన స్వగృహానికి తీసుకురానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల్లో వైఎస్ జగన్ కూడా పాల్గొననున్నారు.
కాగా, వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్ సిపి వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో లింగాల మండల వైసిపి ఇన్చార్జి గా పార్టీ బాధ్యతలు తీసుకొని ఎన్నిక ప్రచారంలో చురుగ్గా పనిచేశారు. ఈయన వైద్య విద్య పూర్తి చేసి విశాఖపట్నంలో తన సతీమణితో కలిసి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యులుగా పనిచేస్తున్నారు. ఈయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అభిషేక్ రెడ్డి మరణించడంతో వైఎస్ఆర్ కుటుంబం తోపాటు, వైసీపీ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాకుండా రాజకీయంగా తన శైలిలో అందరి మదిలో మంచి చోటు సంపాదించుకున్నారు. అలాగే ప్రజలు ఆయన దగ్గరికి వెళ్లి సమస్యలు చెప్పిన వెంటనే స్పందిస్తూ, అన్నా నేనున్నాను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి వారికి అండగా ఉండేవారని వైసిపి శ్రేణులు చెబుతున్నారు.