రైతన్నలు మరోసారి సమరశీలంగా ఉద్యమిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పి) గ్యారెంటీకి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ పంజాబ్ సరిహద్దుల్లోని శంభుకు మార్చ్ నిర్వహించేందుకు సిద్ధమైన రైతులను అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారు. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న రైతు నేత జగ్జిత్సింగ్ దల్లేవాల్సహా అనేక మంది నేతలను హౌస్ అరెస్టు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఎంఎస్పిసహా రైతుల న్యాయమైన డిమాండ్లను అమలు చేసేందుకు నిరాకరించడం దారుణం. అనేక అంశాల్లో బిజెపిని తీవ్రంగా విమర్శించే ఆప్ కమలం పార్టీ బాటలోనే వ్యవహరించడం తగదు. గత మార్చిలో శంభు, ఖనౌరి ప్రాంతాల్లో జెసిబిలతో నేలమట్టం చేసిన పోలీసులు మళ్లీ అదే తరహాలో రైతులపై నిర్బంధాన్ని ప్రయోగించ పూనుకోవడం గర్హనీయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్బంధ వైఖరిని విడనాడి, రైతుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి.
ఏ దేశంలోనూ రైతులకు మద్దతు ధరలను ఇవ్వకూడదని, నగదు బదిలీ తదితర రూపాల్లో మద్దతును అందిస్తే తమకు అభ్యంతరం లేదన్నది ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) విధానం. నయా ఉదారవాద విధానాల అమలులో భాగంగా డబ్ల్యుటిఒ తీసుకొచ్చిన ఈ నిబంధన సంపన్న దేశాలకు అనుకూలంగానూ, మూడో ప్రపంచ దేశాల్లో వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే మహమ్మారిగానూ పరిణమిస్తోంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు అందించే సబ్సిడీ రైతులు పండించే పంట ధరలో దాదాపు సగం వరకూ ఉంటే… జపాన్ దాదాపు పంట ధరకు సమానంగా సబ్సిడీ ఇస్తోంది. వీటిని మాత్రం డబ్ల్యుటిఒ తప్పు పట్టదు. రైతులకు మద్దతు ధర ఇచ్చే మనదేశంతోసహా చాలా మూడో ప్రపంచదేశాలపై డబ్ల్యుటిఒ ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే వాణిజ్య పంటలకు మద్దతు ధరను మనదేశం నిలిపివేసింది. ఇప్పుడు ఆహార పంటల ధరలు దారుణంగా పడిపోకుండా అరకొరగానైనా మద్దతు ధరలు ప్రకటిస్తూ… ఆ ధరకు కొనుగోలు చేయాలని ఆదేశించడమో, తాను కొనుగోలు చేయడమో కేంద్రప్రభుత్వం చేస్తోంది. పంటలకు కనీస మద్దతు ధర అందించకపోవడం అంటే వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతుల పొట్టకొట్టటం, అగ్రదేశాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా మన ఆహార భద్రతను పణంగా పెట్టడం. దేశంలో ప్రజాపంపిణీ వ్యవస్థ ఇప్పటికే కొంత బలహీనపడింది. ఇటువంటి చర్యల మూలంగా ప్రజలకు నిత్యావసర సరుకులు లభించని పరిస్థితి ఏర్పడుతుంది. పేదలు మరింత దుర్భర స్థితిని ఎదుర్కోవాలి. నయా ఉదారవాద విధానాల అమలుతో ప్రారంభమైన రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. కేంద్రం అమలులోకి తీసుకురావాలనుకున్న నల్ల చట్టాలు (మూడు వ్యవసాయ చట్టాలు) ఈ విధానాలను మరింత తీవ్రం చేయడమే.
దుర్భర దారిద్య్రంలోకో, ఆత్మహత్యలకో పాల్పడక తప్పని జీవన్మరణ పరిస్థితుల్లోనే ఈ విధానాలపై ఢిల్లీలో గానీ, ప్రస్తుతం పంజాబ్లో గానీ అన్నదాతలు సమరం చేస్తున్నారు. కార్పొరేట్ అనుకూల విధానాలను, ప్రపంచీకరణను సవాల్ చేసిన ఘనత ఢిల్లీలో చారిత్రాత్మక రైతు ఉద్యమానిదే! ఆ ఒత్తిడితో నల్లచట్టాలను ఉపసంహరించుకున్నా… దొడ్డిదోవన అమలు చేసే ఎత్తుగడలు కొనసాగుతూనే ఉన్నాయి. పంజాబ్లో దల్లేవాల్, ఇతర రైతు నేతల ఆరోగ్యం క్షీణించడం, దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం కావడంతో ఫిబ్రవరిలో చర్చలకు మోడీ సర్కారు అంగీకరించినా నేటికీ తాత్సారం, నిర్బంధం కొనసాగుతూనే ఉంది. స్వామినాధన్ కమిషన్ సిఫార్సుల మేరకు ఎంఎస్పికి చట్టబద్ధత కల్పించడం, రైతుల ప్రాణాలను బలిగొన్న లఖింపూర్ ఖేరీ దోషులను శిక్షించడంసహా ప్రధాన డిమాండ్లపై దాటవేత, మభ్యపెట్టే ఎత్తుగడలు రైతు వ్యతిరేకతను ప్రస్ఫుటం చేసేవే. ఎంత నిర్బంధం ఎదురైనా, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న పంజాబ్ రైతులకు సంఘీభావం తెలపడం అన్నదాతలనే కాదు భారతావనిని రక్షించుకోవడమే!
