విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదకొండేళ్ల తర్వాత కూడా రాజధాని రూపు రేఖలపై అస్పష్టత వీడకపోవడం ఏలికలు సృష్టించిన ఉత్పాతం.టిడిపి కూటమి ప్రభుత్వం శుక్రవారం పెద్ద హైప్ ఇచ్చి ప్రధాని మోడీతో రాజధాని అమరావతి పున:ప్రారంభ మహోత్సవం నిర్వహించాక కూడా అయోమయం అలాగే ఉంది. రూ.49 వేల కోట్ల విలువైన అమరావతి పునర్నిర్మాణ 74 ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపనలు చేశారు. రాజధాని నిర్మాణం స్వాగతించదగినది. ప్రధాని అమరావతికి ప్రాణప్రతిష్ట చేస్తున్నారంటే ఎంత ఆర్థిక సాయం చేస్తారన్న ఉత్సుకత ప్రజల్లో ఉంటుంది. కానీ ప్రధాని మాటలతో సరి పెట్టి అందరినీ తీవ్ర నిరాశకు గురి చేశారు. 2015 అక్టోబర్ 22 దసరా రోజున అమరావతికి తొలుత శంకుస్థాపన చేసిన మోడీ గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లు తెచ్చి అదే కొండంత సాయమనుకోమన్నారు. దశాబ్దం గ్యాప్ తీసుకొని ఒట్టి మాటలు వల్లించడం మోేడీకే చెల్లింది. అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని టిడిపి కూటమి ప్రభుత్వం మోడీ సాయానికి ఉబ్బితబ్బివ్వడం రాష్ట్ర ప్రజలకు ఎదురైన ఒకానొక విచిత్ర అనుభవం!
పదేళ్లుగా అమరావతికి నిరంతరయంగా తాము సాయం చేస్తూనే ఉన్నామని పున:ప్రారంభ వేదికపై ప్రధాని అవాస్తవం చెప్పారు. అంతగా నిధులిస్తే ఎందుకు రాజధాని పూర్తి కాలేదన్న ప్రశ్నకు సమాధానం ఉండదు. నాడు చంద్రబాబు ప్రతిపాదిత బాహుబలి అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లవుతుందని అంచనాలు కట్టగా కేంద్రం తొలినాళ్లలో విదిల్చిన 1,500 కోట్లే మినహా రూపాయి రాలేదు. స్విట్జర్లాండ్, ప్రపంచబ్యాంక్ పేరిట హడావుడే తప్ప తొలి ఐదేళ్లల్లో టిడిపి సర్కారు తాత్కాలిక భవనాలకే పరిమితమైంది. అనంతరం వచ్చిన వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల ఆట తెరమీదకి తేగా ప్రధానిగా ఉన్న మోడీ వారించలేదు సరికదా, రాజధానిరాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని ఉన్నత న్యాయస్థానాల్లో కేంద్రం అఫిడవిట్లు ఇచ్చింది. అమరావతి పున:ప్రారంభ సభలోనూ జగన్ను మోడీ ఏమీ అనలేదు. వైసిపి సైతం ప్రధాని రాష్ట్రానికి ఏమీ చెయ్యకపోయినా, అమరావతికి నయాపైసా ప్రకటించకపోయినా నోరు మెదపలేదు. దీన్నిబట్టే కేంద్ర బిజెపికి, జగన్కు మధ్య సంబంధ బాంధవ్యాలేమిటో తెలిసిపోతుంది.
అమరావతి ‘2.0’ సాకారం కావాలంటే 77 వేల కోట్లు కావాలని టిడిపి కూటమి ప్రభుత్వం ఎస్టిమేట్ వేసింది. వాటిలో కేంద్రం మధ్యవర్తిగా ప్రపంచ బ్యాంక్ నుంచి ఇప్పించే అప్పు 15 వేల కోట్లు కాగా హడ్కో రుణం 11 వేల కోట్లు, జర్మనీ బ్యాంక్ కెఎఫ్డబ్ల్యు లోన్ ఐదు వేల కోట్లకు ఒప్పందాలు కుదిరాయంటున్నారు. అంతా కలిపితే 31 వేల కోట్లు. మిగిలిన 46 వేల కోట్లూ కేంద్రం ఇవ్వాలని రాష్ట్రం అభ్యర్థిస్తోంది. దీనిపై ప్రధాని దాట వేశారు. అమరావతి ఒక నగరం కాదు అదొక మహాశక్తి ఎపిని ఆధునికాంధ్రగా మారుస్తుంది దేశానికి మార్గదర్శనం చేస్తుంది గ్రోత్ ఇంజన్ అవుతుంది మీ భుజాలకు నా భుజం కలుపుతా కలిసిమెలిసి పని చేద్దాం.. అంటూ మాటల మాంత్రికునిలా మోడీ వ్యవహరించగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కూటమి నేతలు పారవశ్యంలో తరించారు. విభజన చట్టంలో రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదని స్పష్టంగా పేర్కొనగా, చట్టాన్ని అమలు చేయాలని, నిధులివ్వాలని అడిగే ధైర్యం చంద్రబాబుకు, కూటమి నేతలకు లేకపోయింది. అప్పులు సమీకరించుకోడానికి సహకరిస్తామని మాత్రమే కేంద్రం చెపుతోంది. అప్పులతో కేపిటల్ను కడితే ప్రజలపై భారాలు తధ్యం. రాష్ట్రాన్ని ఇంతగా దగా చేస్తున్నా బిజెపిపిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అపార ప్రేమ వాత్సల్యాలు కురిపించడం నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడమే. రాజధానికి 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు అమరావతే రాజధానిగా చట్టబద్ధత కోరుతున్నారు. సిఎం ఆ మేరకు హామీ ఇచ్చారు కూడా. కానీ పార్లమెంట్లో చట్టం చేయాల్సిన మోడీఆ ఊసెత్తక పోవడం రైతులను వంచించడం కాదా? తీసుకున్న భూములకే దిక్కులేకపోగా ఇంకా 44 వేల ఎకరాలు దేనికో అర్థం కాదు. బాహుబలి రాజధానికి స్వస్తి పలికి అన్ని వసతులతో రాజధానికి పరిమితం కావాలన్నది నిపుణుల సూచన. విభజన చట్టం మేరకు ప్రత్యేక హోదా సహా హామీల సాధన ద్వారా ప్రణాళికాబద్ధ రాష్ట్ర సమగ్రాభివ్దృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారు. వారి ఆకాంక్షల ప్రకారం నడుచుకోడం రాష్ట్ర ప్రభుత్వ విధి.
